ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ట్రెషరీ దవాఖానలపై భారం తగ్గిస్తూనే ప్రజలకు చేరువలోనే మరింత మెరుగైన వైద్యం అందించేందుకు బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. చికిత్సతో పాటు అవసరమైన వైద్యపరీక్షలను సైతం బస్తీల్లోనే జరిపే విధంగా టీ-డయాగ్నోస్టిక్ సెంటర్ను నెలకొల్పింది. 57రకాల వైద్యపరీక్షలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటితో పాటు గ్రేటర్ వ్యాప్తంగా 20 టీ-డయాగ్నోస్టిక్ మినీ హబ్ల పేరుతో రేడియాలజి ల్యాబ్లను ఏర్పాటు చేశారు.
సమైక్య రాష్ట్రంలో ప్రజారోగ్యం అంటే గాలిలో దీపంలా ఉండేది. కానీ స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగం కొత్త రూపం దాల్చింది.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే దశాబ్దాల దుస్థితి నుంచి.. పోదాం పద.. సర్కారు దవాఖానకు అనే భరోసా వచ్చింది. నాడు ప్ర భుత్వ ఆస్పత్రి అంటే.. దైన్యం.. నేడు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే ఒక ధైర్యం. ఇలా ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వైద్యరంగంలో విప్లవం సృష్టిస్తున్నాయి. కార్పొరేట్కు దీటుగా నగరంలోని ప్రభుత్వ వైద్యశాలలను తీర్చిదిద్దడంతో పేదలకు మెరుగైన వైద్యం అందుతున్నది. వైద్యారోగ్య రంగంలో హైదరాబాద్ ప్రస్థానం.. దేశంలోనే ఒక సరికొత్త అధ్యాయనంగా నిలుస్తున్నది.
– సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ)
ఉమ్మడి పాలనలో సర్కారు దవాఖానలకు వెళ్లాలంటేనే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ఆర్థిక స్తోమత, వేరే గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లోనే సర్కారు వైద్యశాలలను రోగులు ఆశ్రయించేవారు. సరైన సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, సిబ్బంది కొరత తదితర కారణాలతో రోగులు మృత్యువాతపడేవారు. కానీ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు వైద్యరంగానికి పెద్దపీట వేసింది. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. సర్కారు వైద్యశాలల్లో అత్యాధునిక వసతులు కల్పించింది. వాటి రూపురేఖలను మార్చేసింది. కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దింది. ప్రభుత్వ వైద్యశాలల్లో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో వైద్యపరీక్షలు, సేవలు మెరుగుపడ్డాయి. అలాగే నగరంలోని ప్రధాన టీచింగ్ హాస్పిటల్స్తో పాటు అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను తెలంగాణ సర్కారు కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేసింది. అత్యాధునికమైన వైద్య పరికరాలు, సదుపాయాలతో పాటు నిష్ణాతులైన సిబ్బందిని నియమించడం, రోగుల తాకిడికి అనుగుణంగా పడకల సంఖ్యను పెంచడం వంటి చర్యలు తీసుకుంది. దీని వల్ల గతంలో సంభవించిన మరణాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. అంతే కాకుండా అప్పట్లో నామమాత్రంగా ఉన్న ఇనిస్టిట్యూషనల్ డెలీవరీస్(దవాఖానల్లో ప్రసవాలు) సంఖ్య 100 శాతానికి పెరిగింది. కేసీఆర్ కిట్, న్యూట్రీషియన్ కిట్, అమ్మ ఒడి వంటి పథకాలతో సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరగడమే కాకుండా సహజ ప్రసవాల సంఖ్య పెరిగి, సిజేరియన్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది.
తెలంగాణ సర్కారు అన్ని ప్రభుత్వ దవాఖానల్లో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. గ్రేటర్ పరిధిలో మొత్తం ఆరు చోట్ల డయాలసిస్ కేంద్రాలను నెలకొల్పింది. వీటి ద్వారా ప్రతి రోజు 400 నుంచి 500 మంది రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. నగర పరిధిలోని డయాలసిస్ కేంద్రాల్లో ప్రతిరోజు వందల మందికి డయాలసిస్ చేస్తున్నారు. ఉస్మానియా పరిధిలో ప్రతిరోజు 60-70మందికి, గాంధీ పరిధిలో 60-70 మందికి, మలక్పేట పరిధిలో 20 మందికి డయాలసిస్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు నిమ్స్లో ప్రతి రోజు సుమారు 100-135 మందికి డయలసిస్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని వనస్థలిపురం పరిధిలో ప్రతిరోజు 20 మందికి, మహేశ్వరం సీహెచ్సీ పరిధిలో 20 మందికి డయాలసిస్ నిర్వహిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 102 డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ డయాలసిస్ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్కు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన 102 డయాలసిస్ కేంద్రాలను మూడు క్లస్టర్లుగా విభజించారు. అదే సమయంలో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ హాస్పిటల్స్ను ప్రధాన హబ్స్గా ప్రకటించారు. ఒక్కో హబ్ పరిధిలో ఒక్కో క్లస్టర్లోని డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తాయి. నిమ్స్ పరిధిలో ఇప్పటికే 18 డయాలసిస్ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. దీని పరిధిలోకి మరో 18 కేంద్రాలు కొత్తగా రానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిమ్స్ పరిధిలో మొత్తం 40పైగా డయాలసిస్ సెంటర్స్ పనిచేయనున్నట్లు వెల్లడించారు.
గతంలో ఒక డయాలసిస్ కిట్(డయలైజర్)ను ఒక రోగికి అనేకసార్లు వినియోగించేవారు. దీని వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి, అనారోగ్యానికి దారితీసేది. దీనికి చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కారు ప్రత్యేకంగా డీ-మేడ్-సెంటర్లను ఏర్పాటు చేసి అక్కడ సింగిల్ యూజ్డ్ డయలైజర్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో ఒక డయలైజర్ను ఒకేసారి వినియోగిస్తారు. రెండోసారి వినియోగించరు.
సాధారణంగా ఒక్కసారి డయాలసిస్ చేయించాలంటే కార్పొరేట్ దవాఖానలో రూ.3వేల నుంచి 5వేల వరకు ఖర్చవుతుంది. రోగి ఆరోగ్యపరిస్థితి ఆధారంగా వారానికి ఒకటి లేదా రెండు సార్లు లేదా మూడుసార్లు చేయాల్సి ఉంటుంది. మరికొందరికి నెలలో రెండు లేదు ఒకసారి డయాలసిస్ చేయాలి. ఈ క్రమంలో ఒక రోగికి ప్రతి నెల సుమారు రూ.12వేల నుంచి రూ.40వేల వరకు ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా నిరుపేద రోగులు ఈ ఆర్థిక భారం భరించలేక ఉన్న ఆస్తులు అమ్ముకునేవారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కారు కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం అన్ని జిల్లాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆపన్నహస్తం అందిస్తున్నది.
రోగులకు అత్యాధునిక వైద సేవలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు గ్రేటర్ పరిధిలోని అన్ని టీచింగ్ హాస్పిటళ్లతో పాటు ఇతర ఆరోగ్య కేంద్రాల్లో కోట్ల రూపాయల విలువచేసే అత్యాధునిక వైద్యపరికరాలను సమకూర్చింది. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో రూ.64కోట్ల వ్యయం తో నిమ్స్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో రోబో యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.21కోట్లతో ఉస్మానియా, గాంధీ, నిమ్స్లో క్యాథ్ల్యాబ్లను కూడా సమకూర్చింది. అలాగే ఉస్మానియా, గాంధీ, నిమ్స్లో ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి నెలా ఒక్కో హాస్పిటల్లో 4 నుంచి 6 మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
గతంలో వైద్యసదుపాయాలకు నోచుకోని సర్కారు దవాఖానల్లో రోగులకు పడకలు దొరకడం కూడా గగనంగానే ఉండేది. దీని వల్ల నిరుపేద రోగులు సరైన వైద్యం అందక దవాఖానల్లో, పడకలు లభించక మార్గ మధ్యలోనే ప్రాణాలు వదిలే పరిస్థితి ఉండేది. సమస్య తీవ్రతను గమనించిన తెలంగాణ సర్కారు.. నగరంలోని ఉస్మానియా, గాంధీ, ఎంఎన్జే, నిలోఫర్ దవాఖానల్లో పడకల సామర్థ్యాన్ని 2000కు పైగా పెంచింది. అలాగే ఉస్మానియాలో 1163గా ఉన్న పడకల సంఖ్యను 2000కు, 1132 పడకల గల గాంధీ దవాఖానలో 2000, 450 పడకలు ఉన్న ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ సామర్థ్యాన్ని 750 పడకలకు, 500 పడకల సామర్థ్యం ఉన్న నిలోఫర్ దవాఖాన సామర్థ్యాన్ని వెయ్యి పడకలకు పెంచింది. దీంతో రోగులకు పడకల కొరత సమస్య తీరడమే కాకుండా సకాలంలో మెరుగైన వైద్యం అందుతున్నది. రూపాయి ఖర్చు లేకుండా కీలక శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తూ…ప్రాణాలు నిలుపుతుండటంతో ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరుగడమే కాదు.. పేద, మధ్యతరగతి వర్గాల ఆరోగ్యానికి భరోసా దొరుకుతున్నది.
ఒకప్పుడు కేవలం ధనికులకే పరిమితమైన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను తెలంగాణ సర్కారు ఆరోగ్యశ్రీ పథకం కిందకు తీసుకురావడంతో నిరుపేద రోగుల ప్రాణాలు నిలబడుతున్నాయి. గతంలో ఆర్థిక స్తోమత లేని వారు అవయవాలు విఫలమై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది. నేడు ఆరోగ్యశ్రీ పథకం కింద అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి ఉచితంగా నిర్వహించడంతో నిరుపేద ప్రాణాలకు భరోసా లభించింది.