ఎల్బీనగర్, అక్టోబర్ 16 : బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను చూసి ప్రతిపక్షాలకు దిమ్మదిరిగి పోయిందని ఎల్బీనగర్ ఎమ్మెలే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం ఎల్బీనగర్లో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, మాజీ కార్పొరేటర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బ్రష్టుపట్టిపోయిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు గతంలో ఢిల్లీకి గులాములుగా ఉండేవారని, ఇప్పుడు బెంగళూరు గులాములుగా మారారని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటూ రేటెంత రెడ్డిగా మారాడని ఆరోపించారు. బీఆర్ఎస్ తిరస్కరించిన నాయకులను పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇస్తుందని విమర్శించారు. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికీ ధీమా అని.. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చని ఎన్నో పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేశాడని, తాజాగా ప్రజల కోసమే అద్భుతమైన మ్యానిఫెస్టోను ప్రకటించారని తెలిపారు. ఎల్బీనగర్లో ఇప్పటికే ఒక రౌండ్ ఎన్నికల ఇంటింటి ప్రచారం పూర్తయ్యిందని, ఎన్నికల సమయానికి ప్రతి ఇంటిని 8మార్లు టచ్ చేస్తామన్నారు. ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం కురుమ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఒక విజన్ ఉన్న లీడర్ అని, రాబోయే ఎన్నికల్లో 90కి పైగా సీట్లు గెలిచి మూడవసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు సామ తిరుమల్రెడ్డి, కొప్పుల విఠల్రెడ్డి, ముద్రబోయిన శ్రీనివాస్రావు, జిట్టా రాజశేఖర్రెడ్డి, జీవీ సాగర్రెడ్డి, ప్రవీణ్కుమార్, జిన్నారం విఠల్రెడ్డి, చెరుకు సంగీతా ప్రశాంత్గౌడ్, రమావత్ పద్మానాయక్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, గజ్జల మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్ నాయక్, త్రివేది, తదితరులు పాల్గొన్నారు.