సిటీబ్యూరో, అక్టోబరు 13 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్ విడుదల కావడంతో రిటర్నింగ్ అధికారి సాయిరాం నామినేషన్లు స్వీకరించారు. షేక్పేట ఎమ్మార్వో కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పలువురు నామినేషన్లను దాఖలు చేశారు. తొలిరోజు 10 నామినేషన్లు దాఖలయ్యారు. రెండు రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు కాగా, 8 స్వతంత్ర అభ్యర్థులు. తెలంగాణ పునర్నిర్మాణ సమితి తరపున పూస శ్రీనివాస్ నామినేషన్ వేయగా, నవతరం పార్టీ నుంచి అర్వపల్లి శ్రీనివాస రావు వేశారు.
స్వతంత్ర అభ్యర్థులు సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్రెడ్డి, చలిక చంద్రశేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రం రెడ్డి, ఇబ్రహీంఖాన్, సయ్యద్ ముస్తఫా హుస్సేన్, సల్మాన్ఖాన్ నామినేషన్లు దాఖలు చేశారు. షేక్పేట ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయాన్ని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఈసీఐ నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నామినేషన్ల స్వీకరణకు సన్నద్ధంగా ఉండాలని ఆర్వో సాయిరాంకు సూచించారు.