హయత్నగర్ : షెట్టర్ తొలగించి అపోలో ఫార్మసీలో దోపిడీకి పాల్పడిన సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, ఫార్మసీ ఇన్చార్జీలు నగేష్, వెంకటేష్ లు తెలిపిన వివరాల ప్రకారం…హయత్ నగర్ డివిజన్ కేంద్రంలోని న్యూఅమ్మ ఆస్పత్రి సమీపంలో కొంతకాలంగా అపోలో ఫార్మసీని నిర్వహిస్తున్నారు.
రోజూ మాదిరిగానే సిబ్బంది ఫార్మసీ షాపును శనివారం రాత్రి మూసివేసి వెళ్లిపోయారు. గుర్తుతెలియని దుండగుడు ఇనుపరాడు సహాయంతో షెట్టర్ను తొలగించి లోపలికి ప్రవేశించి డ్రాలో దాచిన రూ.35 వేల నగదును ఎత్తుకుని పరారయ్యాడు. ఆదివారం ఉదయం ఫార్మసీ ఇన్చార్జి వెంకటేష్ వచ్చి చూడగా ఫార్మసీ షెట్టర్ కొంత తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా నగదు కనిపించలేదు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.