మారేడ్పల్లి, జనవరి 11: మారేడ్పల్లిలో జరిగిన హత్య ఘటనలో.. మృతుడిని కాపాడేందుకు అతడి స్నేహితుడు ఆ క్షణంలో 100కు లేదా 108 కు ఫోన్ చేసి ఉంటే ప్రాణాలతో బతికి ఉండేవాడని నార్త్జోన్ డీసీపీ చందనాదీప్తి వెల్లడించారు. ఆ సమయంలో దాదాపు 45 నిమిషాల సేపు మృతుడి స్నేహితుడు మృతుడి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదని చెప్పారు. గత ఆదివారం మారేడ్పల్లిలో జరిగిన హత్య కేసు వివరాలను అడిషనల్ డీసీపీ యోగేశ్ గౌతమ్, ఏసీసీ రమేశ్తో కలిసి వెల్లడించారు. ఓల్డ్ గ్యాస్ మండికి చెందిన కొరియర్ బాయ్ శివాజీ అలియాస్ శివ (25), సైనిక్పురికి చెందిన తన స్నేహితుడు మింటూతో కలిసి ఆదివారం అర్ధరాత్రి తన ఇంటికి సమీపంలో మద్యం తాగుతున్నాడు. సికింద్రాబాద్కు చెందిన గౌస్ పాషా (22) కూడా అక్కడే మద్యం తాగుతూ వీరిద్దరితో గొడవ పడ్డాడు. మాటా మాటా పెరిగి మింటూ, శివ కలిసి గౌస్పాషాపై దాడి చేశారు. తనపై జరిగిన దాడిని జీర్ణించుకోలేక గౌస్పాషా తన స్నేహితులైన మహ్మద్ నయీమ్ (22), మహ్మద్ జాకీర్ హుసేన్ అలియాస్ జక్కి (23)కి ఫోన్చేసి దాడి విషయం చెప్పాడు. వెంటనే వారిద్దరు కలిసి కారులో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న శివ, మింటూతో గౌస్పాషా, మహ్మద్ నయీమ్, జక్కిలు దాడికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన గౌస్పాషా తన జేబులో ఉన్న పదునైన కత్తితో శివాజీ మెడపై దాడి చేశాడు. ఆ తర్వాత నిందితులు ముగ్గురు అక్కడి నుంచి కారులో పారిపోయారు.
పోలీసులకు ఫోన్ చేసి ఉంటే…
శివపై అర్ధరాత్రి సుమారుగా 12-20కి దాడి జరిగింది. మెడపై కత్తిపోటుతో శివ చాలా సేపు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడాడు. అక్కడే ఉన్న అతడి స్నేహితుడు మింటూ దాదాపు 45 నిమిషాల సేపు శివ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కాల్ చేశాడు. కానీ ఎవ్వరూ స్పందించలేదు. దీంతో మింటూ భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తెలవారుతుండగా ఉదయం ఆరింటికి ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విగతజీవుడైన శివ పార్థివ దేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. అయితే.. మింటూ ఆ సమయంలో 100కు లేదా 108కు ఫోన్ చేసి ఉంటే సరైన సమయానికి వైద్యం అంది శివ ప్రాణాలతో బయటపడగలిగేవాడని డీసీపీ చందనాదీప్తి చెప్పారు. సీసీ కెమెరాల సాయంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను రిమాండ్కు పంపారు.