మతాలు, కులాల పేరిట రాజకీయాలు కుదరవు
చిల్లరమల్లర వ్యక్తులను కనిపెడుతున్నాం..
శాంతికి విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు
న్యూసిటీకి దీటుగా ఓల్డ్సిటీ అభివృద్ధి
పాతనగరంలో అవసరమైన చోట రోడ్ల విస్తరణ
పురపాలక,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
చార్మినార్, కార్వాన్ నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన
‘రాష్ట్రంలో మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్నిశక్తులు పన్నాగం పన్నుతున్నాయి. ఆ ప్రయత్నాలు మానండి. 8 ఏండ్లుగా రాష్ట్రంలో ఒక్క ఘటన కూడా చోటుచేసుకోలేదు. సీఎం కేసీఆర్ సారథ్యంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయి. ఈ విషయంలో రాజీలేదు. మతవిద్వేషాలు రెచ్చగొడితే ఉక్కుపాదంతో అణచివేస్తాం. విధ్వంసకరశక్తులు,చిల్లరమల్లర వ్యక్తులను ప్రజలు ఓ కంట కనిపెట్టాలి. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేవు. రూ.495 కోట్లతో పాతనగరంలో అభివృద్ధి పనులు ప్రారంభించాం. కొత్తనగరానికి దీటుగా పాతనగరాన్ని అభివృద్ధి చేస్తాం’ అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చార్మినార్, కార్వాన్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తేతెలంగాణ)/చార్మినార్: ‘రాష్ట్రంలో కొన్నిశక్తులు మతవిద్వేషాలు రెచ్చగొట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికైనా అలాంటి యత్నాలు ఆపండి. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తాం. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. కులం, మతం పేరు మీద రాజకీయం చేసే విధ్వంసకర శక్తులు,చిల్లర మల్లర వ్యక్తులను ఒక కంట కనిపెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని పాతనగరంలో రూ.495 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లోనే కాదు..రాష్ట్రంలో కూడా మత రాజకీయాలు చేయలేదని వివరించారు.
పనికిమాలిన పంచాయితీలు లేవు..కులాలు, మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టలేదని, ఆ చిచ్చులో చలిమంటలు కాచుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదని, చేయబోమని తేల్చిచెప్పారు. నేను అబిడ్స్లో చదువుకునే రోజుల్లో ప్రతి ఏడాది ఐదు నుంచి పదిరోజులపాటు కర్ఫ్యూ విధించేవారని, కానీ ఇప్పుడు ఆ బాధ లేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో హోంశాఖ మంత్రి మహమూద్అలీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, చార్మినార్, బహదూర్పుర, కార్వాన్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేలు ముంతాజ్ అహ్మద్ ఖాన్, మౌజంఖాన్, కౌసర్మొహినుద్దీన్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు వాణీప్రసాద్, ఎంఎస్ ప్రభాకర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త, నగర పోసు కమిషనర్ సీవీ ఆనంద్, బల్దియా కమిషనర్ లోకేశ్కుమార్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..
న్యూసిటీకి దీటుగా ఓల్డ్సిటీ అభివృద్ధి
ప్రస్తుతం ఏ ఎన్నికలు లేకపోయినా ఒకేరోజు రూ.495 కోట్లతో పాతనగరంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం. న్యూసిటీకి దీటుగా ఓల్డ్సిటీని అభివృద్ధి చేసి తీరుతాం. గతంలో మోజంజాహి మార్కెట్ను చూసి బాధపడేటోళ్లం. ఇప్పుడు కళకళలాడుతోంది. ‘కుడా’కు పూర్వ వైభవం తీసుకొస్తాం. 437 ఏండ్ల చరిత్రగల వారసత్వ సంపదను కాపాడతాం. నగరంలో తాగునీరు, విద్యుత్ సరఫరా సమస్య లేదు. గ్రేటర్వ్యాప్తంగా కృష్ణా, గోదావరి జలాలు సమృద్ధిగా సరఫరా అవుతున్నాయి. పాతనగరంలో అవసరమైన చోట రహదారులను విస్తరిస్తాం. కొత్త నగరంలో మాదిరి పాతనగరంలో కూడా ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నాం. జూపార్కు వద్ద నిర్మిస్తున్న వంతెనను ఏడాదిలోపు అందుబాటులోకి తెస్తాం. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి మేరకు పాతనగరంలో ప్రస్తుతం 300 స్వచ్ఛ ఆటోలకు అదనంగా మరో 150 వరకు అందజేస్తాం. బహదూర్పుర ఫ్లైఓవర్కు ఓ మంచి వ్యక్తి పేరు పెట్టి స్మరించుకుందాం. ఈ అంశాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించి ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించాలి.
నోటరీ సమస్యను పరిషరిస్తాం..
పాతనగరంతోపాటు నగరంలో ఇతర ప్రాంతాల్లో నోటరీ స్థలాల సమస్యను పరిష్కరిస్తాం. జీవో 58,59లతో లక్షమందికి హైదరాబాద్లో పట్టాలు ఇచ్చాం. నోటరీతో ఉన్న ప్రాపర్టీపై హక్కు కల్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. త్వరలో సీఎం కేసీఆర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాం. పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేస్తాం. నగరంతోపాటు అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రైవేటు సేవలకు దీటుగా ప్రభుత్వ వైద్య సేవలు అందుతున్నాయి. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెండు,మూడు నెలల్లో పూర్తిచేసి నిజమైన లబ్ధిదారులకు అందజేస్తాం.
మైనార్టీల అభివృద్ధికి ప్రాధాన్యం
గత ప్రభుత్వాలు పాతనగరం అభివృద్ధిని పట్టించుకోలేదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. ఎన్నో పథకాలు పెట్టారు. పాతనగరం అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం హర్షనీయం. –మహమూద్అలీ, హోంశాఖ మంత్రి
వారసత్వ సంపద పరిరక్షణకు కృషి
పాతనగరంలోని వారసత్వ, పురాతన కట్టడాల పరిరక్షణకు కృషి చేస్తున్నాం. ఈ సంపదను భావితరాలకు అందించేందుకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపడుతున్నాం. నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెద్దఎత్తున అభివృద్ధి పనులకు
శంకుస్థాపన జరగడం సంతోషకరం.
– అసదుద్దీన్ ఒవైసీ, హైదరాబాద్ ఎంపీ
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు..