“గత రెండు మూడు రోజులుగా వాన దంచికొట్టినా, జన జీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్కారు అన్ని రకాలుగా సేవలందించింది. గత కాలంలో ప్రజా జీవనానికి కలిగిన ఇక్కట్లు పునరావృతం కాకుండా ప్రభుత్వ పాలనా యంత్రాంగం రానున్న ఇబ్బందులకు అడ్డుకట్ట వేసింది. గతంలో కురిసిన వర్షానికి మించి ఇప్పుడు అత్యధికంగా వర్షాలు కురిసినా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని జన జీవితానికి అందుబాటులో ఉండి ఎలాంటి విపత్తు సంభవించకుండా సేవలందించింది. నగర వీధులు ఏరులై పారినా ఎక్కడా నీరు నిల్వకుండా, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా నగర పాలకులు ఎప్పటికప్పుడు వ్యూహాత్మక చర్యలతో ప్రజాసేవలోనే తలమున కలయ్యారు. జన జీవనం స్తంభించకుండా అన్ని రకాలుగా సర్కారు ప్రజా జీవనాన్ని ఆదుకోగలిగింది.”
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 27(నమస్తే తెలంగాణ): గ్రేటర్లో వాన దంచికొట్టింది. సీజన్ ఆరంభంలో నైరుతి రుతు పవనాలు మొహం చాటేసేందుకు ప్రయత్నించినా.. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ తడిసి ముద్దయ్యింది. కరువుతీరా… కురిసిన వర్షాలతో భూగర్భజలాలు పైకి ఎగబాకాయి. మొన్నటి దాకా లోటు వర్షపాతం అంటూ నిరాశపడిన నగరవాసికి ఇప్పుడు సాధారణానికి మించి భారీ స్థాయిలో నమోదైన వర్షంతో తీవ్ర ఉపశమనం లభించింది. ప్రధానంగా గ్రేటర్ వ్యాప్తంగా సాధారణం కంటే దాదాపు 65 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో పాటు మూడు రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద ఏరులై పారింది. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక, ముందస్తు చర్యలతో ఇంతటి భారీ వర్షాల్లోనూ కించిత్తు ఆస్తి, ప్రాణ నష్టం కూడా లేకపోవడం నగరవాసులకు సంతోషాన్ని కలిగించే అంశం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కార్పొరేటర్ నుంచి మంత్రుల దాకా… కార్మికుడు మొదలు కమిషనర్ వరకు… హోం గార్డు నుంచి పోలీసు కమిషనర్ వరకు… ప్రభుత్వ, అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో మోహరించి చేపట్టిన విపత్తు నిర్వహణతో గ్రేటర్ ముఖచిత్రంలో మునుపటి కంటే భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. అకస్మాత్తుగా వర్షానికి ఆదిలో కొంతమేర ఇబ్బందులు ఎదురైనా… ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలతో వరద నిల్వకుండా… రోడ్లపై వాహనాలు నిలవకుండా పకడ్బందీ విపత్తు నిర్వహణ కనిపించింది.
ముందుచూపు.. వ్యూహాత్మక నిర్ణయాలు…
గ్రేటర్ హైదరాబాద్లో చినుకుపడితే చాలు.. రోజంతా రోడ్లన్నీ ట్రాఫిక్జాంలతో కనిపిస్తాయి. కాలనీలన్నీ జల దిగ్బంధనంలోకి వెళ్లి, పునరావాస కేంద్రాలు వెలుస్తాయి. కానీ, ఇప్పటివరకు సాధారణం కంటే ఇంత భారీ స్థాయిలో ఎక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ అలాంటి చిత్రాలు మాత్రం కనిపించలేదు. సాధారణంగా వర్షం కురిస్తే ఆ సమయంలో ఒక్కసారిగా ట్రాఫిక్ నిలిచిపోవడం, రోడ్లపై వరద పారడం పరిపాటి. గత మూడు, నాలుగు రోజుల్లో ఇంతకు మించి నగరవాసులు ఇబ్బందిపడిన దాఖలాలు లేవు. ప్రధానంగా వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీసీ)తో గతంలో ముంపుబారిన పడే అనేక కాలనీలు ఈసారి సాధారణ జీవనాన్ని సాగించాయి. దీంతో పాటు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం, ఐటీ కారిడార్లలో మూడు దశల్లో లాగ్ అవుట్ను అమలు చేయడం వంటి కీలక నిర్ణయాలతో రోజుల తరబడి చినుకు ఆగకున్నా నగరవాసులు ఇబ్బందులు పడలేదు. దీనికి తోడు ‘అత్యవసరమైతే తప్ప బయటికు రావొద్దు’ అని ప్రభుత్వం, అధికార యంత్రాంగం చేసిన విజ్ఞప్తికి నగరవాసులు సైతం సానుకూలంగా స్పందించడంతో నగరంలో జన జీవనం సాధారణంగా సాగింది.
ముందుగానే రంగంలోకి…
గతంలో వరదల్లో జనం ఇబ్బందులు పడితే గానీ సహాయక చర్యలు మొదలయ్యేవి కావు. కానీ, ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో జీహెచ్ఎంసీ, జల మండలి, పోలీసు వంటి శాఖల యంత్రాంగం ముందుగానే రంగంలోకి దిగింది. ప్రధానంగా ఇంతటి వర్షంలోనూ నగర వ్యాప్తంగా ఎక్కడా పారిశుధ్య సేవలు నిలిచిపోలేదు. వైద్యారోగ్య శాఖ కూడా ఇప్పటికే క్షేత్ర స్థాయిలో మోహరించి, యాంటీ లార్వా చర్యలతో పాటు వరద నీళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జ్వర సర్వేలకు కూడా సిద్ధమైంది. అవసరమైతే ప్రత్యేక వైద్య శిబిరాలకు కూడా సిద్ధంగా ఉంది. మరోవైపు జల మండలి యంత్రాంగం తాగునీరు కలుషితం కాకుండా మూడు అంచెల్లో క్లోరినేషన్ ప్రక్రియ చేపడుతుంది. పోలీసు శాఖ నగరంలో 143 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించింది. అందులో మేజర్ పాయింట్లు 23 ఉండటంతో వర్షం పడగానే అక్కడక్కడా ప్రత్యేక బలగాలను దింపి వరద నిల్వకుండా చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ కూడా ఏ మాత్రం సర్వీసులు తగ్గకుండా చర్యలు తీసుకోవడంతో ఒక వైపు మెట్రో, ఇంకోవైపు ఆర్టీసీ ప్రయాణంతో ట్రాఫిక్ కొంతమేర ఉపశమనం లభించినట్లయింది.
గ్రేటర్ వ్యాప్తంగా భారీ వర్షాలు
గత మూడు, నాలుగు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. సీజన్ మొదలైన రెండు నెలల్లోనే ఇంతటి వర్షపాతం గడిచిన పదేండ్లలో ఎన్నడూ నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో సాధారణం 260.5 మి.మీ. కాగా ఇప్పటివరకు 53 శాతం అధికంతో 399.1 మి.మీ. వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లాలో ఏకంగా 73 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. ఇక్కడ సాధారణం 259.3 మి.మీ. కాగా, ఇప్పటివరకు 447.6 మి.మీ. వర్షం కురిసింది. అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో 224.9 మి.మీ. సాధారణ వర్షపాతానికి గాను 68 శాతం అధికంతో 376.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా నందిగామలో సాధారణం కంటే 147 శాతం, షాబాద్లో 146 శాతం, శామీర్పేటలో 128 శాతం, కీసరలో 116 శాతం, చార్మినార్ పరిధిలో 88 శాతం అధికంగా వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ (ఏడు శాతం), కందుకూరు (9 శాతం), శంషాబాద్ (8 శాతం) పరిధుల్లోనే సాధారణం కంటే స్వల్పంగా ఎక్కువ వర్షం కురిసింది.
ఈ సీజన్లో (జూన్ ఒకటో తేదీ) నమోదైన వర్షపాతం వివరాలు ఇలా…(మీల్లీ మీటర్లలో..)