రిలయన్స్ నిప్పన్ బీమా కంపెనీకి లక్ష జరిమానా
సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): పాలసీదారు చెల్లించిన ప్రీమియం వడ్డీతో సహా చెల్లించాలని హైదరాబాద్ వినియోదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు కె.రామ్మోహన్, సి.లక్ష్మీప్రసన్నలతో కూడిన బెంచ్ రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. మాసాబ్ట్యాంక్కు చెందిన మేరీ శ్యామలమ్మ విశ్రాంత బ్యాంక్ ఉద్యోగిని. 2012లో రూ.97,510 సంవత్సర ప్రీమియంతో పదేండ్ల కాలపరిమితితో బీమా పాలసీని తీసుకున్నారు. ఐదేండ్ల తర్వాత రూ. లక్ష ప్రీమియం చెల్లిస్తే అదనపు లాభాలు పొందవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కాగా, పాలసీదారు కొన్నాళ్ల తర్వాత పరిశీలించగా, అదేం లేదని తేలింది.
దీంతో తాను చెల్లించిన డబ్బులు వాపస్ ఇవ్వడంతో పాటు పాలసీని రద్దు చేయాలని అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేయగా, ప్రీమియం చెల్లించిన తేదీల నుంచి వడ్డీతో సహా చెల్లించి పాలసీని రద్దు చేయాలని ఆదేశించింది. అయినా కంపెనీ ఖాతరు చేయకపోవడంతో బాధితురాలు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1ను ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం ప్రీమియంపై అదనంగా వసూలు చేసిన మొత్తానికి 12 శాతం వడ్డీతో కలిపి రూ.లక్షను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. రూ.50వేల నష్టపరిహారంగా, మరో రూ.50 వేలు నిర్లక్ష్యంగా వ్యవహరించి సేవలను నిరాకరించినందుకు చెల్లించాలని, ఖర్చుల కింద రూ.10 వేలు కట్టాలని కమిషన్-1 ఆదేశాలు జారీ చేసింది.