Yellamma Temple | అమీర్పేట, జూన్ 19 : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో కొనసాగుతున్న నిత్యాన్నదాన పథకానికి రిలయన్స్ సంస్థ రూ.కోటి విరాళాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని దేవాలయ ఈవో గురువారం మహేందర్ గౌడ్ ధ్రువీకరించారు. ప్రతి యేటా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. ఐపీఎల్ ముంబయి జట్టు యజమాని అయిన నీతా అంబాని హైదరాబాద్తో జరిగే ముంబయి మ్యాచ్ కోసం నగరానికి వస్తుంటారు. మ్యాచ్ను తిలకించేందుకు చేరుకున్న ప్రతిసారీ.. ముందుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ తిలకించేందుకు వెళ్తుంటారు.
అమ్మవారిపై ఎంతో నమ్మకంతో వస్తుండగా.. నీతా అంబానీకి దేవాలయ అధికారులు పలుమార్లు ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అయితే, ఇటీవల ఏప్రిల్ 23న హైదరాబాద్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ను తిలకించేందుకు నీతా అంబానీ కాకుండా వారి తల్లి పూర్ణిమా దలాల్, సోదరి మమతా దలాల్ వచ్చారు. ఈ క్రమంలోనే అప్పటి ఈవో బీ క్రిష్ణ మరోసారి ఆలయ అభివృద్ధి అంశాన్ని వారికి గుర్తు చేశారు. కాగా, వారం రోజుల కిందట నగరంలోని రిలయెన్స్ సంస్థ ప్రతినిధులు దేవాలయ అధికారులకు రూ.కోటి విరాళానికి సంబంధించిన విషయాన్ని వెల్లడించారు. రెండు రోజుల కిందట ఈ నిధులు దేవాలయ ఖాతాలో జమైనట్టు ఈవో మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అంబానీ కుటుంబానికి దేవస్థానం అధికారులు ధన్యవాదాలు తెలిపారు.