పరిశీలనకు ప్రత్యేక అధికారుల నియామకం
కలెక్టర్ హరీశ్ వెల్లడి..
మేడ్చల్ రూరల్, మే 25 : 58 జీవో కింద ఇండ్లను క్రమబద్ధీకరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో 58 జీవోపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 58 జీవో ప్రకారం క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్లను గురువారం నుంచి పరిశీలించనున్నట్లు తెలిపారు.
ఇందుకోసం నియమించిన అధికారులకు తగు సూచనలు చేశామన్నారు. ఇండ్ల పరిశీలనకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా డిప్యూటీ తాసీల్దార్ లేదా ఆర్ఐ, సర్వేయర్తో కలిసి వెళ్లాలని సూచించారు. నిర్మించుకున్న ఇంటి ఫొటో తీసి, ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, జీవో మార్గదర్శకాలకు లోబడి ఇండ్ల నిర్మాణాలు ఉన్నాయా లేదా అని పరిశీలించాలని చెప్పారు. అదనపు కలెక్టర్ ఎనుగు నరసింహా రెడ్డి, డీఆర్వో లింగ్యానాయక్ పాల్గొన్నారు.