Hyderabad | సిటీబ్యూరో, మార్చి 21(నమస్తే తెలంగాణ) : సిటీలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అబిడ్స్ ఒకటి. ఓ వైపు కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్సులు, మరోవైపు నిత్యం వాహనాల రాకపోకలు. అర్ధరాత్రి వరకు రయ్యిమంటూ దూసుకుపోయే వాహనాలతో సిటీ సెంటర్లో ఉండే అబిడ్స్ రణగొణ ధ్వనులతో మోతమోగిపోతుంది. కానీ గడిచిన రెండు నెలలుగా ఆ ప్రాంతంలో శబ్ద తీవ్రత తగ్గుతున్నట్లు పీసీబీ అధ్యయనంలో వెల్లడైంది. మధ్యాహ్నం, రాత్రి పూట నమోదు చేసిన శబ్ద కాలుష్యం తీవ్రత సగానికి కంటే తక్కువగా ఉండటం విశేషం. సాధారణ రోజుల్లో ఆ ప్రాంతంలో 60 నుంచి 70 డెసిబుల్స్ మధ్య శబ్దం ఉత్పత్తి అవుతుంటే… గడిచిన రెండు నెలల్లో 30 డెసిబుల్స్ లోపే నమోదు కావడం గమనార్హం.
నగర వ్యాప్తంగా కమర్షియల్, రెసిడెన్షియల్, ఇండస్ట్రీయల్ ప్రాంతాలుగా విభజించి 10 చోట్ల ధ్వని తీవ్రతను కాలుష్య నియంత్రణ మండలి లెక్కిస్తున్నది. ఇలా ప్రాంత స్థితిగతులను బట్టి శబ్ద కాలుష్యాన్ని విశ్లేషిస్తుండగా… నగరంలో సగటున 65 నుంచి 100 డెసిబుల్స్ స్థాయిలో శబ్ద తీవ్రత నమోదవుతుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, డబ్ల్యూహెచ్ఓ నివేదికల ప్రకారం బహిరంగ ప్రాంతాల్లో 16 గంటల టైం బేస్లో 50 నుంచి 55 డెసిబుల్స్ దాటితే ప్రమాదమేనని నివేదికలు చెబుతున్నాయి. కానీ ఫిబ్రవరి, మార్చి 15 వరకు అబిడ్స్ పరిధిలో నమోదైన శబ్ద తీవ్రత 30 నుంచి 40 డెసిబుల్స్ లోపే ఉంది. రాత్రి పూట 25 నుంచి 30 డెసిబుల్స్ లోపు ఉన్నట్లు పీసీబీ వెల్లడించింది.
ఎల్బీ స్టేడియం సిగ్నల్ నుంచి కోఠి వుమెన్స్ కాలేజీ మధ్య అబిడ్స్ ఉండగా… ఈ ప్రాంతంలో నిత్యం వాహన రాకపోకలతో సందడిగానే ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలతో శబ్ద కాలుష్యం స్థాయి తగ్గినట్టుగా పీసీబీ వెల్లడించింది. రాత్రిపూట కూడా 25 డెసిబుల్స్ లోపు ధ్వని తీవ్రత నమోదైనట్లుగా నివేదికలో తేలింది. అయితే రోడ్లపై ట్రాఫిక్ రద్దీని నియంత్రించే క్రమంలో రోడ్లపై అనధికారిక పార్కింగ్, హారన్ వినియోగం ఆంక్షలను అమలు చేస్తున్నటు స్థానిక ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. దీంతోపాటు రాత్రి పూట వాహన శబ్ద కాలుష్యాన్ని కట్టడి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అధికారులు
వెల్లడించారు.