సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఓ వ్యక్తి మృతికి కారణమయ్యారని కారులోఉన్న వారందరిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.. కానీ అదే పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన హత్య ఘటనలో పాల్గొన్న రౌడీషీటర్ పేరును మాత్రం బయటకు వెల్లడించకుండా పోలీసులు దాగుడు మూతలాడుతున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి పుట్టా రాము హత్య కేసు దర్యాప్తులో పాల్గొన్న రౌడీషీటర్ విషయాన్ని దర్యాప్తు అధికారులు ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తున్నది. గత బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో యూసుఫ్గూడ ఎల్ఎన్నగర్లోని హిమాంబీ అలియాస్ హసీనాకు చెందిన భవనంలోని పెంట్ హౌజ్కి పుట్టా రామును పిలిపించి, పదకొండు మంది వ్యక్తులు కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి చంపారు. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు సీసీ కెమెరాలు, ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను గుర్తించి అందులో ఎ1 నుంచి ఎ6, ఎ12, ఎ13 వరుసగా అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
రౌడీషీటర్ జిలానీ తన గ్యాంగ్తో ఒక హత్య చేశాడంటే .. పోలీసుల దృష్టి తనవైపు కేంద్రీకృతం కాకుండా 24 గంటల్లోనే తన గ్యాంగ్ సభ్యులను పోలీసుల ఎదుట లొంగిపోయేలా చేస్తాడని గతంలో హత్యకు గురైన బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మూడు నెలల క్రితం మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో బోరబండకు చెందిన సయ్యద్ నుమాన్ హత్యకు గురయ్యాడు. అంతకుముందు నుమాన్కు, జిలానీ కుటుంబ సభ్యులకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో గాయపడిన నుమాన్ బోరబండ పోలీస్స్టేషన్కు వెళ్లాడు. అక్కడి నుంచి గాంధీ దవాఖానకు వెళ్తుండగా జిలానీ కిడ్నాప్ చేసి నర్సాపూర్ అడవుల్లోకి తరలించి హత్య చేశాడని అతడి కుటుంబ సభ్యులు గతంలో ఆరోపించారు. అయితే ఈ కేసులో జిలానీ పాత్ర లేదని అక్కడి పోలీసులు తేల్చారు. ఆ కేసులోను హత్య జరిగిన తరువాత నిందితులు లొంగిపోయారు. అలాగే జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో హత్య జరిగిన తరువాత ఆరుగురు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. ఇక్కడ కూడా జిలానీ పాత్ర లేదని తేలుస్తారా? అనే సందేహాలు సర్వత్రా వినవస్తున్నాయి.
పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించడంతో అందులో బోరబండకు చెందిన రౌడీషీటర్ జిలానీ ఉన్నాడు. కానీ పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆరుగురిలో జిలానీ లేకపోగా.. కేసులో అతడి పేరు ఎక్కడ ప్రస్తావనకు రాలేదు. ముఠాలోని ఆరుగురు పోలీసులకు చెప్పిన విషయం ఏమిటీ, రౌడీషీటర్ పాత్రను వివరించారా? అనేది పోలీసులు విలేకరుల సమావేశంలో వెల్లడించలేదు. రిమాండ్ రిపోర్టులోనూ పేర్కొనలేదు. కేవలం ఎ7 నుంచి ఎ11 వరకు పరారీలో ఉన్నట్లు చెబుతున్నా.. ఇప్పటికే పరారీలో ఉన్న నిందితులెవరనే విషయంపై పోలీసులకు స్పష్టత వచ్చింది. వారి పేర్లను ఎందుకు ప్రస్తావించడం లేదనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.