Drinking Water | సిటీబ్యూరో/కంటోన్మెంట్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : వారంతా నిరుపేదలు.. బస్తీల్లో ఉంటూ చిన్న పాటి గూడులో ఉంటూ సామాన్య జీవనం గడిపే వారు.. కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత తాగునీటి పథకానికి లబ్ధిదారులు అయ్యామంటూ.. ఎంతో సంతోషపడ్డారు… నెలవారీ నల్లా బిల్లు రావడం లేదని ఎంతో సంబురపడ్డారు.. అయితే ప్రభుత్వం మారగానే అధికారుల వైఖరిలో వచ్చిన మార్పుతో వీరి ఆశలు అడి ఆశలయ్యాయి. నెలల తరబడి బిల్లులు ఇవ్వని అధికారులు ఒక్కసారిగా మీరంతా ఉచిత నీటి పథకానికి అర్హత లేదంటూ నల్లా బిల్లులు జారీ చేస్తూ వచ్చారు. నెలవారీగా బిల్లు చెల్లింపులే కష్టమైన వీరికి కొన్ని నెలల బిల్లును ఒకేసారి జారీ చేసి..వేలల్లో బకాయిలు కట్టాలంటూ అధికారులు హుకూం జారీ చేశారు.
దీంతో అధికారుల నిర్లక్ష్యానికి షాక్ గురవ్వడం వీరి వంతైంది. ఉచిత నీటి పథకానికి అర్హత లేని, ఆధార్ సీడింగ్ చేసుకోవాలని ముందే చెబితే మేం కూడా నెలకు 20 కిలో లీటర్ల నీటిని పొందే వాళ్లమని, అకస్మాత్తుగా నల్లా బిల్లులు జారీ చేయడం ఏమిటని స్థానికులు భగ్గుమంటున్నారు. అధికారుల వైఫల్యానికి మేం ఎలా బాధ్యులమవుతామని, పైగా నల్లా బిల్లులను నాలుగు దశల్లో చెల్లింపులు జరపాలని అనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా కంటోన్మెంట్ బోర్డులో 6,800 మందికి జారీ చేసిన నల్లా బిల్లుల అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు స్థానికులు విన్నవించడం, బాధిత వినియోగదారులు సైతం బోర్డు ఎదుట పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టే యోచనలో ఉండడం..రాబోయే రోజుల్లో ఈ అంశం ఎటువైపునకు వెళుతుందోనన్న చర్చ జరుగుతున్నది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రతి ఇంటికీ జీహెచ్ఎంసీలో మాదిరిగానే ఉచితంగా నెలకు 20వేల లీటర్ల వరకు మంచి నీటిని సరఫరా చేయాలని మూడేండ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సంబంధించి ఉచిత మంచినీటి పథకంలో లబ్ధిదారులుగా చేరాలంటే ఆధార్ నంబరు అనుసంధానం తప్పనిసరిగా చేసుకోవాలని నిబంధన విధించింది. దీనికి సంబంధించి అన్ని ప్రాంతాలతో పాటు కంటోన్మెంట్లోని అధికారులు సైతం అక్కడక్కడా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో 33వేల మందికి నీటి కనెక్షన్లు ఉండగా కేవలం 26,200 మంది మాత్రమే ఉచిత మంచినీటి పథకంలో లబ్ధిదారులుగా నమోదు చేసుకోవడంతో వారికి మాత్రమే పథకం వర్తిస్తున్నది. కానీ మిగతా 6,800 మంది ఈ పథకానికి అనర్హత సాధించారు. అయితే ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నామనే నెపంతో వీరికి ఇంతకాలం నెలల తరబడి బిల్లులు జారీ చేయలేదు. ఇప్పుడు ఒక్కసారిగా పాత బకాయిలతో సహా అధికారులు వీరికి నల్లా బిల్లులు జారీ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఒక్కసారిగా వేలల్లో వస్తున్న బిల్లులను చూసి షాక్ అవ్వడం వీరి వంతైంది. బోర్డు పరిధిలోని ప్రతి ఇల్లు, ప్రతి ఫ్లాట్ వినియోగదారులు నెలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీటిని పొందేందుకు అర్హులని బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. ఆధార్- క్యాన్ అనుసంధానం చేసుకోని వినియోగదారులు ఇంకా 6,800 మంది ఉన్నారని వారందరికీ అవకాశం ఉన్నా ఆధార్తో అనుసంధానం చేసుకోకపోవడంతోనే 2021 నుంచి మంచినీటి బిల్లులు జారీ చేయడం చేస్తున్నామని చెబుతున్న అధికారులు …మరో పక్క బకాయిలను నాలుగు దశల్లో చెల్లించాలని నల్లా బిల్లులు అందుకున్న వారికి చెప్పడం కొసమెరుపు. నెలల తరబడి బిల్లులు జారీ చేయకుండా పథకానికి దూరమంటూ ఒకేసారి పెద్ద మొత్తంలో బిల్లులు ఇవ్వడం పట్ల వేలాది రూపాయలు ఎలా కట్టాలంటూ లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. పాత బకాయిలు మాఫీ చేస్తామని చెప్పి చేయకపోవడం, అందులో రూ. వేలల్లో బిల్లులు జారీ చేయడం ఏమిటని రసూల్పురకు చెందిన స్వరూప, విద్యారాణిలు ప్రశ్నిస్తున్నారు.
కంటోన్మెంట్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. బస్తీల్లో, కాలనీల్లో విస్తృతంగా ఉచిత నీటి పథకంపై అవగాహన కల్పించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు. ఆయా బస్తీల్లో ఉండే రాజకీయ నేతలు ఉచిత నీటి పథకానికి సంబంధించి ఆధార్ నంబర్లు సేకరించడంతో ఉచిత నీటి పథకానికి తాము కూడా అర్హులమనే భావనలో వినియోగదారులు ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆధార్తో క్యాన్ నంబర్లు అనుసంధానం కాకపోవడంతో మూడేండ్లుగా బిల్లులు వస్తున్నాయి. కానీ ఎన్నికల నేపథ్యంలో బిల్లులు కంటోన్మెంట్ బోర్డు జారీ చేయకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఎన్నికల అనంతరం ఇటీవల కాలంలో బిల్లులు జారీ చేయడంతో ఒక్కసారిగా షాక్కు లోనయ్యారు. రసూల్పురా, బోయిన్పల్లి, మారేడ్పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారంతో పాటు పికెట్ తదితర ప్రాంతాల్లో ఉచిత మంచినీటి పథకానికి అర్హులు కాని వారందరికీ బిల్లు వస్తుండటంతో ఏం చేయాలో తోచక, బిల్లులు కట్టలేక నరకయాతన అనుభవిస్తున్నారు. మొదట్లోనే ఆధార్ అనుసంధానం కాలేదని బోర్డు అధికారులకు తమకు చెబితే బాగుండేదని, కానీ ఇలా బిల్లులు పంపించి మొత్తం కట్టాలని నోటీసులు సైతం పంపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఉచిత మంచినీటి పథకానికి ఇప్పటికైనా నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్లు బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే అలా నమోదు చేసుకున్నవారు పథకంలో చేరిన నాటి నుంచి మాత్రమే 20వేల లీటర్లు ఉచితంగా పొందేందుకు అర్హులవుతారని, అప్పటి వరకు బిల్లులు చెల్లించాల్సిందేనని తెలిపారు. మరో 6,800 మంది వినియోగదారులు ఈ పథకం కింద నమోదు చేసుకోవాల్సి ఉన్నదని చెప్పారు. దీంతో సుమారు 33వేల మంది వినియోగదారులు ఈ పథకాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కానీ స్థానిక వినియోగదారులు మాత్రం అధికారుల వైఫల్యానికి మేం ఎందుకు బకాయిలు కట్టాలని, ఉచిత తాగునీటి పథకానికి మేం అర్హులమేనని, జారీ చేసిన నల్లా బిల్లు విషయంలో బోర్డు బాధ్యత తీసుకుని మాకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 20వేల లీటర్ల ఉచిత నీటి పథకానికి సంబంధించి అన్ని బస్తీల్లో, కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. కచ్చితంగా ఆధార్ను అనుసంధానం చేసుకోవడంతో పాటు మీటర్ను ఏర్పాటు చేసుకోవాలని సూచించాం. కానీ వినియోగదారులు పట్టించుకోకుండా పెడచెవిన పెట్టారు. రాష్ట్ర సర్కారు మాత్రం కచ్చితంగా క్యాన్ నంబర్తో ఆధార్ అనుసంధానం చేసుకున్న వినియోగదారులకు మాత్రం 20వేల లీటర్ల ఉచిత నీటిని జలమండలి నుంచి బోర్డుకు విడుదల చేస్తున్నది. అలా కేవలం కంటోన్మెంట్ పరిధిలో కేవలం 26,200 మంది వినియోగదారులు మాత్రమే ఆధార్తో అనుసంధానం, మీటర్లను ఏర్పాటు చేసుకున్నారు. మిగతా 6,800 మంది స్పందించకపోవడంతోనే వారికి బిల్లులు జారీ చేశాం. ఇప్పటికైనా అర్హులుగా కావాలంటే ఆధార్తో అనుసంధానం చేసుకోవాలి.