Hyderabad | మన్సూరాబాద్, ఏప్రిల్ 1 : ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో తలెత్తిన వివాదంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కార్పొరేటర్తో పాటు మరో మహిళ వేదింపులకు గురి చేయడంతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన చెమ్మల బలవర్ధన్రెడ్డి (36) ప్రస్తుతం నాగోల్, జైపురికాలనీ, శ్రీనివాసకాలనీలో నివాసముంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. బలవర్ధన్రెడ్డికి భార్య అంజలి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే బలవర్ధన్రెడ్డికి భాగ్య అనే మహిళతో ఆర్థిక లావాదేవీలు ఉన్నా యి. భాగ్య పక్షాన బీజేపీ పార్టీకి చెందిన గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్మహేశ్వర్రెడ్డి తరచూ బలవర్ధన్రెడ్డికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడు.
గత నెల 30న కొందరు వ్యక్తులను ఇంటి మీదకు పంపించాడు. దీంతో మనస్తాపం చెందిన భార్య పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది. ఆదివారం ఉదయం మరోసారి భాగ్యతో పాటు మరి కొందరు వ్యక్తులు బలవర్ధన్రెడ్డి ఇంటికి వచ్చి గొడవకు దిగారు. ఇదిలా ఉండగా ఆదివారం మధ్యాహ్నం అంజలి తన భర్తకు ఫోన్ చేయగా ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. స్థానికులు ఇంటికి వెళ్లి చూడగా బలవర్ధన్రెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి కనిపించాడు. గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్మహేశ్వర్రెడ్డి వేదిస్తున్నాడని, భాగ్య సైతం లైంగిక దాడి కేసు పెడతానంటూ సూసైట్ నోట్లో రాశాడని తెలిపింది. ఈ మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు
చేపట్టారు.