మేడ్చల్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర సమీపంలో ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో రియల్ రంగం పరుగులు పెడుతున్నది. 2021-22 సంవత్సరానికి మించి రియల్ రంగం జోరుగా కొనసాగుతున్నది. 2022-23 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ. 2401.66 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదిలో రూ.1898 కోట్ల ఆదాయం రాగా..ఈసారి అదనంగా రూ.400 కోట్లు రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం వచ్చింది. మేడ్చల్, ఉప్పల్, వల్లభ్నగర్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఘట్కేసర్, కుత్బుల్లాపూర్, బాలానగర్, కాప్రా, నారపల్లి, కీసర సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో రియల్ ఎస్ట్టేట్ రంగలో దూసుకెళ్తున్నది. జిల్లా వ్యాప్తంగా 1,62,276 రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి రమేశ్రెడ్డి తెలిపారు.
జిల్లాలో రియల్ రంగం ఉపందుకుంది. జిల్లాలో అత్యధిక పరిశ్రమలు ఉన్న మేడ్చల్ జిల్లా రాష్ట్రంలోనే నంబర్వన్ స్థానంలో ఉండగా, దీంతో పాటు ఇటీవలే కండ్లకోయలో ఐటీహబ్ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.400 కోట్లను మంజూరు చేయగా నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది.