ఖైరతాబాద్, జూన్ 1: హైదరబాద్లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. సరసమైన ధరకే ప్లాట్స్ అని చెప్పి కోట్లాది రూపాయలను వసూలు చేసింది. కానీ కస్టమర్లకు మాత్రం అనుకున్న సమయానికి ప్లాట్స్ను అందించలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు తమ ఆవేదనను వెల్లగక్కారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు మావర్మకుమార్, మూర్తి శ్రీనివాస్, ప్రసాద్ శివపురం, గణేశ్, ఫణిలు తమకు జరిగిన మోసాన్ని వెల్లడించారు.
బాధితుల కథనం ప్రకారం.. జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేటు లిమిటెడ్ (జయ గ్రూప్)కు చెందిన కొందరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తమను ఫోన్లో సంప్రదించి.. చందానగర్, గోపన్పల్లి, కూకట్పల్లిలోని తమ ప్రాజెక్టుల్లోని అన్ని హంగులు కలిగిన ప్లాట్స్ తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అప్పటికే సదరు సంస్థ 20 ప్రాజెక్టులు చేపట్టిందని ప్రచారం చేశారని అన్నారు. వారి మాటలకు ఆకర్షితులమై ప్లాట్స్ కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యామని చెప్పారు. చందానగర్లోని హిల్టన్ పేరిట ఉన్న ప్రాజెక్టును చూపించారని, సుమారు 800 ప్లాట్స్ ఉన్నాయని చెప్పారని, ముందస్తుగా కొంత చెల్లిస్తే 2023 వరకు ప్లాట్స్ అప్పగిస్తామని చెప్పారని పేర్కొన్నారు. దీంతో వారి మాటలు నమ్మి 400 మంది ఒక్కొక్కరుగా రూ.20 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు చెల్లించామని అన్నారు. గడువుదాటినా ప్లాట్స్ను అప్పగించకపోవడంతో తాము ఆ సంస్థ ఎండీని నిలదీశామని తెలిపారు. దీంతో కొందరికి డబ్బులు వాపస్ ఇస్తామని చెప్పి.. చెక్కులు అందజేశారని.. అవి కూడా బౌన్స్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే, ఆ ఫ్లాట్స్ చూపించిన స్థలం గురించి విచారణ చేయగా, అది వేరే సంస్థకు సంబంధించిందని తెలిసిందని తెలిపారు. వేరే సంస్థతో ఎంవోయూ చేసుకొని తమకు తప్పుడు ఫ్లాట్స్ చూపించి మోసగించాడని తెలిపారు. చివరకు తాముమోసపోయామని గ్రహించడంతో బాధితులందరం కలిసి కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశామని చెప్పారు. తమ ఫిర్యాదు మేరకు సంస్థ యజమానిపై పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారని తెలిపారు. సంస్థ ఎండీతో పాటు పది మంది డైరెక్టర్లు సుమారు 1500 మంది వద్ద వసూలు చేసి రూ.300 కోట్లకు పైగా మోసం చేశారని వెలుగుచూసిందని ఆరోపించారు. దీనిపై పోలీసులతో పాటు ఇప్పటికే ఈడీకి ఫిర్యాదు చేశామని, సదరు సంస్థపై విచారణ జరిపించి యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరారు.