కవాడిగూడ, ఏప్రిల్ 29: డీపీఆర్ లేకుండానే మూసీ రివర్ ఫ్రంట్ ఆధ్వర్యంలో భారీ నిర్మాణ పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేయడం సరికాదని పర్యావరణవేత్తలు అన్నారు. బుధవారం ప్రజా కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహం నిర్వహించారు. పర్యావరణవేత్తలు సాగర్ ధార, లుబానా, ప్రొఫెసర్ వెంకటదాస్, శరత్, కొండలరావు, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ తదితరులు హాజరై మాట్లాడుతూ మూసీ అంటే జీవనది అని.. ప్రజల నది అని అన్నారు. మూసీలోకి ఎలాంటి కాలుష్యం రాకుండా అరికట్టేందుకు రెండేండ్లుగా ఎలాంటి చర్యలు చేపట్టని ప్రభుత్వం..
వేల కోట్ల రూపాయలతో మూసీ పునరుజ్జీవం పేరిట ప్రభుత్వ స్థలాలు, నిధులను మూసీ నదిని రియట్ ఎస్టేట్ వ్యాపారానికి ఉపయోగించడమేనని ఆరోపించారు. మూసీ నది చుట్టూ ఉన్న వేలాది మంది ప్రజల ఇండ్లను తొలగించి ఎవరి ప్రయోజనం కోసం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జీవోలతో ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లాలని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు.