కాప్రా, అక్టోబర్ 26 : రైతుల సంక్షేమం పట్టని కాంగ్రెస్ రైతుబంధు పథకం ఆపివేయడానికి కుట్రలు పన్నడం అత్యంత దుర్మార్గమైన చర్య అని, రైతులు దీన్ని ఎంత మాత్రమూ సహించరని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. రాష్ట్ర సీఎం రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకం లక్షలాది మంది రైతులను ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు.
గురువారం సాయంత్రం సైనిక్పురిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ పార్టీ రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని ఎన్నికల సంఘాన్ని కోరడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్కు బీఆర్ఎస్ అంటే భయమని, రైతులంటే ద్వేషమన్నారు.
కాంగ్రెస్ రైతులను పట్టించుకోలేదని, మహిళా సంక్షేమాన్ని పట్టించుకోలేదని, బీఆర్ఎస్ పార్టీ రైతులను ఆదుకునే చర్యలను, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పండించిన పంటను, ప్రతి గింజనూ కొని వారిని ఆదుకుందని, రైతుల కష్టాలు తీర్చిందన్నారు. కర్ణాటకలో కరెంటు ఉత్పత్తిలేదని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. రేవంత్రెడ్డి మూడు గంటలు కరెంటు ఇస్తామని అనడం ఆయన అవివేకానికి, అహంకారానికి నిదర్శనమన్నారు.
ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రైతులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. రైతు బంధును అడ్డుకుంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. రైతు వ్యతిరేక చర్యలు చేపడితే వారిని తరిమి తరిమి కొడ్తారన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులు బీఆర్ఎస్ పక్షాన ఉన్నారనే కోపంతో కాంగ్రెస్ రైతు బంధు నిలిపివేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ కొత్తరామారావు, ఏఎస్రావునగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు కాసం మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.