పాఠశాలల్లో వైద్య శిబిరాల ఏర్పాటు
అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
మూడు వేల మంది చిన్నారులకు స్క్రీనింగ్
జూబ్లీహిల్స్, మార్చి 31: ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల ఆరోగ్యానికి ఆర్బీఎస్కే (రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం) పూర్తి భరోసాను కల్పిస్తోంది. పిల్లల్లో కనిపించే స్వల్ప అనారోగ్య లక్షణాలు దీర్ఘకాలిక వ్యాధులుగా మారకుండా ఉండేందుకు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు అందిస్తున్న ఆర్బీఎస్కే వైద్య సేవలు వారికి శ్రీరామరక్షగా మారుతున్నాయి. ‘రాష్ట్రీయ బాల స్వా స్థ్య కార్యక్రమం’ ద్వా రా వైద్య సేవలందిస్తున్నారు. శ్రీరాంనగర్ టీమ్-ఏ, టీమ్-బీ వైద్యాధికారులు డాక్టర్ రాజేశ్వరి, దీప్తిశ్రీ, మమత బృందాలు ప్రతి పాఠశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి స్క్రీనింగ్ చేపడుతున్నారు. శ్రీరాంనగర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలు గుర్తించడంతో పాటు వివిధ అనారోగ్య సమస్యలున్న విద్యార్థులను మెరుగైన చికిత్సల కోసం ప్రత్యేక వాహనాల్లో సంబంధిత దవాఖానలకు తరలిస్తున్నారు. విద్యార్థులకు పీహెచ్సీ, సీహెచ్సీలలో వైద్య సేవలందిస్తున్న వైద్యులు దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు నిలోఫర్లోని ‘డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్’ కు తరలిస్తున్నారు. శ్రీరాంనగర్ క్లస్టర్లోని రహ్మత్నగర్, జవహర్నగర్, బోరబండ, బ్రహ్మశంకర్నగర్, మహాత్మానగర్, వినాయక్నగర్, ఎన్ఎస్బీ నగర్, కార్మికనగర్ తదితర పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో ఆర్బీఎస్కే వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు
ఈ ఏడాది పాఠశాలలు ముగిసే లోపు వైద్య శిబిరాలతో విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు 3000 మంది విద్యార్థులకు, చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించాం.
–డాక్టర్ దీప్తిశ్రీ, మెడికల్ ఆఫీసర్