సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఒడిశా కేంద్రంగా అక్రమంగా తయారవుతున్న నకిలీ మద్యం ప్లాంట్పై రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి, అక్రమ మద్యం తయారీ మూలాలను ధ్వంసం చేయడంతో పాటు 26 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రంగారెడ్డి జిల్లా, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ సోమవారం వెల్లడించారు.
ఈ నెల 16న రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామంలో భూనేటి గోపీకృష్ణ నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా పరిసర ప్రాంతాల్లో అన్నెపల్లి శివారెడ్డి అలియాస్ కొండల్రెడ్డి, బింగి బాల్రాజ్గౌడ్, పొరండ్ల సంజయ్కుమార్ల ఆధ్వర్యంలో నకిలీ మద్యం సరఫరా అవుతున్నట్లు తెలిపాడు. దీంతో ఆ నలుగురిని అరెస్ట్ చేసి రంగారెడ్డి, నల్గొండ డివిజన్లలో తనిఖీలు చేపట్టి 3078 లీటర్ల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నకలీ మద్యం ఎక్కడ తయారువుతుంది, దాని మూలాలు ఎక్కడున్నాయనే విషయాన్ని ఆరా తీయడంతో ఒడిశాలోని కటక్ ప్రాంతంలో మూత పడిన ప్లాంట్లో తయారీ జరుగుతుందని తేలింది.
దర్యాప్తులో భాగంగా అక్కడికి ప్రత్యేక బృందం వెళ్లి ఒడిశా పోలీసుల సహకారంతో కటక్ సమీపంలో తయారు చేస్తున్న అక్రమ బాటిలింగ్ యూనిట్పై దాడి చేశారు. అక్కడ భారీ ఎత్తున నకిలీ మద్యానికి సంబంధించిన ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరు 26 మందిని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. నిందితుడైన బింగి బాల్రాజ్గౌడ్కు చెందిన నారాయణపూర్లోని ఎస్వీ వైన్స్ దుకాణం లైసెన్స్ను సస్పెండ్ చేసి, దుకాణాన్ని మూసేశారు. మద్యం, బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్న లైసెన్స్ దారులు నియమ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసు దర్యాప్తు రంగారెడ్డి, నల్గొండ జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది.