సిటీబ్యూరో/బండ్లగూడ జనవరి 21 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా సమర్థవంతంగా చేపట్టాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. ఆదివారం రాజేంద్రనగర్ సర్కిల్ బుద్వేల్ గ్రామం పరిధిలోని వికాస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలన్నారు.
ఓటరు నమోదులో భాగంగా గ్రేటర్లో శని, ఆదివారాల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్కు విశేష స్పందన వచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించారు. జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాన్ని చాలామంది సద్వినియోగం చేసుకున్నారు. జిల్లాలో ఓటు హక్కు కోసం దాదాపు మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఓట్ల తొలగింపునకు 1000 మందికిపైగా, చిరునామా మార్పు, వివరాల సవరణకు 2వేలకు పైగా అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.