విద్యుత్ వాహనాల వాడకం.. వాటి తయారీని ప్రోత్సహిస్తూ.. పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా 150 ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటవ్వగా, టెస్ట్ రన్లో వీటి పనితీరు భేష్గా ఉన్నట్లు రుజువైంది. ఈవీ ధరలు ఎంత ఉండాలనేదానిపైన మిగిలిన రాష్ట్రాల్లో గందరగోళ పరిస్థితి ఉంటే.. ముందుగానే ధరలను(యూనిట్కు 12 రూపాయలు) ప్రకటించిన రాష్ట్రం కూడా తెలంగాణే కావడం విశేషం. పైగా ‘టీఎస్ఈవీ’ యాప్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? మనకు దగ్గర లొకేషన్ ఎక్కడ ఉంది? పేమెంట్? తదితర వివరాలన్నీ అందుబాటులో ఉంచారు.
అంతేకాదు నగరంలోని డీజిల్, పెట్రోల్ ఆటోల్లో ఎలక్ట్రిక్ కిట్లను అమర్చే ప్రణాళికలను కూడా రెడ్కో చేపట్టింది. ఇదిలా ఉంటే ఈవీ రంగానికి మరింత ఊతమిచ్చేలా నేటి నుంచి ఈ మొబిలిటీ వారోత్సవాలను నిర్వహిస్తోంది సర్కారు. ఈ సందర్భంగా ఆదివారం నగరంలో ఈవీ వాహనాల ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. ఇక ఆర్టీసీ సైతం నగరంలో కాలుష్య రహిత సిటీ బస్సులు నడిపించేందుకు కార్యాచరణ చేపట్టింది. నెలాఖరుకు 300పైగా విద్యుత్ బస్సులు సిటీకి చేరుకోనున్నాయి. మరోవైపు 11న జరిగే ఫార్మూలా ఈ రేసుకు సాగర తీరం ముస్తాబవుతున్నది.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 ( నమస్తే తెలంగాణ ) : పీల్చే గాలి అత్యంత ప్రధానం. ఆహారం లేకున్నా కొద్ది రోజులు బతకవచ్చునేమో..! కానీ స్వచ్ఛమైన గాలి లేకపోతే ఉండలేం. అట్లాంటి ప్రాణ వాయువు అంతరించిపోవడానికి 80 శాతం వాటా వాహనాల నుంచే వచ్చే కాలుష్యానిదేనని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018 నివేదిక కూడా అంతర్జాతీయంగా అత్యధిక వాయు కాలుష్యంతో సతమతమవుతున్న 12 నగరాల్లో 11 భారత్లోనే ఉన్నాయని పేర్కొంది. ఇట్లాంటి దుర్భర పరిస్థితులను అంతమొందించడానికి పర్యావరణాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడమే అసలైన చికిత్స. అందులో భాగంగానే తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఈవీ రంగానికి మరింత ప్రోత్సాహం అందిస్తున్నది. నేటి నుంచి ఈ మొబిలిటీ హైదరాబాద్ వీక్ను నిర్వహిస్తున్నది.
ఈవీలతోనే జీవనం..
ధూళి కణాలు, పొగ, పొగ మంచు వంటి వాయువులు గాలిలో అధికంగా చేరడంతో వాయు కాలుష్యం ఏర్పడుతున్నది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ, మానవహక్కుల విభాగం అంచనా ప్రకారం ఏటా సుమారు 70 లక్షల మం ది వాయు కాలుష్యం మూలంగా మృత్యువాత పడుతున్నారని తేల్చింది. వాహనాల నుంచి విడుదల అవుతున్న కాలుష్యం ఫలితంగా ఏటా 4 లక్షల మంది చనిపోతున్నారని వెల్లడించింది. కాలుష్యాన్ని అరికట్టడానికి విద్యుత్తు వాహనాలే ప్రత్యామ్నాయమని తేల్చింది.
80 శాతం వాహనాలతోనే..
వాహనాలతోనే అధికంగా కాలుష్యం నమోదవుతున్నది అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. ఆ కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు 2010లో భారత్ స్టేజ్(బీఎస్)- 4 ప్రమాణాలున్న వాహనాలను ప్రధాన నగరాల్లో వినియోగించాలని కేంద్రం సూచించినా కాలుష్య కట్టడికి తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. దేశ వ్యాప్తంగా ఏటా 2.15కోట్ల వాహనాలు రోడ్డెకుతున్నాయి. ఏటా 400 కోట్ల టన్నుల పెట్రోలియం వినియోగమవుతుంది. గ్యాస్ 1004 కోట్ల టన్నులు వాడుతున్నాం. ఒక వాహనం ప్రయాణించే సమయంలో 3.7లీటర్ల డీజిల్ వినిమయానికి 10,180 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. పెట్రోల్ అయితే 8,887 గ్రాములు గాలిలో కలుస్తుంది. మీథెన్, నైట్రస్ ఆమ్లం కూడా కొద్ది మొత్తంలో విడుదల అవుతాయి. ఏసీల నుంచి క్లోరోఫ్లూరో కార్బన్లు వెలువడుతాయి. వీటివల్ల కాలుష్యం పెరిగి.. ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. ఇట్లాంటి ప్రమాదరక పరిస్థితులకు విద్యుత్తు వాహనాలు వాడటమే సరైనది.
తెలంగాణే నంబర్ వన్..
ప్రభుత్వం చొరవతోనే గ్రేటర్ వ్యాప్తంగా 150 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. ఇప్పటికే టెస్ట్ రన్లో భాగంగా ఈవీ ఛార్జింగ్ కేంద్రాల పనితీరు భేష్గా ఉందని రుజువయింది. ఈ స్టేషన్లు మరి కొన్ని రోజుల్లో వాహనదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఈవీల పనులన్నీ చకచకా పూర్తి చేసి వాటిని అందుబాటులోకి తీసుకువస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. అంతేకాదు ఈవీ ధరలు ఎంత ఉండాలనేదానిపైన కూడా మిగిలిన రాష్ట్రాల్లో గందరగోళ పరిస్థితి ఉండగా వాహనదారులను దృష్టిలో పెట్టుకుని ముందగానే యూనిట్ ధరలను ప్రకటించిన రాష్ట్రం కూడా తెలంగాణే కావడం విశేషం. అంతేకాదు ఈవీ ఛార్జింగ్ కేంద్రాల సమాచారం అంతా ఒక్క క్లిక్లో అందుబాటులోకి రెడ్కో తీసుకొస్తున్నది. ‘టీఎస్ఈవీ’ యాప్లో ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? మనకు దగ్గర లొకేషన్ ఎక్కడ ఉంది? పేమెంట్? తదితర వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి. యూనిట్ ధర రూ.12గా నిర్ణయించింది. అంతేకాదు నగరంలోని డీజిల్, పెట్రోల్ ఆటోలలో ఎలక్ట్రిక్కిట్లను అమర్చే ప్రణాళికలను కూడా రెడ్కో చేపట్టింది.
నేటి ఈ-మొబిలిటీ షెడ్యూల్ ఇలా..
నగరంలోని పీపుల్స్ప్లాజా, మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి సాయంత్రం 3 గంటలకు ఈవీ వాహనాల ర్యాలీ ప్రారంభమై హైటెక్ సిటీ మెటల్ చార్మినార్ వద్దకు చేరుకుంటుంది. అక్కడ మంత్రి కేటీఆర్ ఈవీ ర్యాలీలో పాల్గొని హైటెక్స్ సభావేదికకు చేరుకుంటారు. కాగా పీపుల్స్ ప్లాజా వద్ద ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సినీ హీరో ఆనంద్లు ఈవీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తారు. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హీరోయిన్ శ్రీలీల విద్యుత్ వాహనాల ర్యాలీని ప్రారంభిస్తారు.
నగరానికి 300 పైగా విద్యుత్ బస్సులు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ గ్రేటర్ పరిధిలో విద్యుత్ బస్సులు రాబోతున్నాయి. ఇప్పటికే కొనుగోలు దశలో బస్సులు ఉన్నాయి. దీంతో నగరంలో కాలుష్య రహిత సిటీ బస్సులు నడిపించడంపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే విద్యుత్ బస్సులు తీసుకువస్తున్నారు. విద్యుత్ బస్సులు నెలాఖరు నాటికి ఆర్టీసీకి అందనున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
నగరంలో పెరుగుతున్న కొత్త రూట్లు..
గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ సర్వీసులు విస్తరిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఐటీ పరిశ్రమలతో పాటు ఫార్మా రంగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెట్తో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలు నగర శివార్లలో ఏర్పాటవుతున్నాయి. దీంతో ఆయా రూట్లలోఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా రూట్లలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్తో పాటు ఫైనాన్షియల్ సిటీలో కూడా ఆర్టీసీ సైబర్ లైనర్ పేరుతో ఏసీ బస్సులను ఐటీ ఉద్యోగుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ఆర్టీసీ గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ సేవలసు విస్తరించి, ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం కొత్త రూట్లు ఏర్పాటు చేస్తున్నారు. మరో పక్క కొత్త రూట్ల కోసం రూట్ సర్వే నిర్వహిస్తున్నారు. కాగా, ప్రస్తుతం నగరంలోని సిటీ బస్సుల కాలపరిమితి మించిపోతున్నది. ఈ మేరకు దాదాపు 600 సూపర్ లగ్జరీలను జిల్లాల నుంచి తీసుకువస్తున్నారు. మరో రెండు, మూడు నెలల్లో ఏర్పాట్లు పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు.
ఈవీ ర్యాలీ.. ఇదిగో దారి..
హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్లో భాగంగా ఆదివారం పీపుల్స్ ప్లాజా నుంచి హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ వరకు ఎలక్ట్రిక్ వాహన ర్యాలీ జరగనుంది. ఈ మేరకు పోలీసులు నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ర్యాలీ మార్గంలో కొన్ని చోట్ల ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అమలులో ఉంటాయి. పీపుల్స్ప్లాజా నుంచి ఐమాక్స్ రోడ్ రోటరీ మీదుగా ఖైరతాబాద్ వీవీ స్టాచ్యూ కేసీపీ జంక్షన్-పంజాగుట్టు-ఎన్ఎఫ్సీఎల్-ఎస్ఎన్టీ జంక్షన్-సాగర్ సొసైటీ-కేబీఆర్ పార్క్ మీదుగా జూబ్లీ చెక్పోస్ట్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ మీదుగా సైబరాబాద్ లిమిట్స్కు ఈవీ ర్యాలీ చేరుకుంటుంది. ఈ ర్యాలీని దృష్టిలో పెట్టుకుని నగర ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
దారి మళ్లిస్తారు ఇలా..
మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఇలా..
మియాపూర్ స్టేషన్-యూటర్న్-మియాపూర్ జంక్షన్-ఆల్వీన్ ఎక్స్రోడ్-లెఫ్ట్ టర్న్-హఫీజ్పేట ఫ్లైఓవర్-లేబర్ అడ్డ-కొత్తగూడ జంక్షన్-సీఐఐ జంక్షన్-మెటల్ చార్మినార్-ఖానామెట్-హైటెక్స్ గేట్ 5 వరకు విద్యుత్ వాహనాల ర్యాలీ సాగుతుంది. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ర్యాలీ మార్గం గుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు మధ్యాహం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమలులో ఉంటాయి.