కాచిగూడ, ఆగస్టు 18 : పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ గోశాల ఫెడరేషన్ నిర్వాహకులు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. రానున్న రాఖీ పండుగ సందర్భంగా అక్క, చెల్లెళ్లు ఆవుపేడతో తయారుచేసిన రాఖీలనే సోదరులకు కట్టాలని తెలంగాణ గోశాల ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ పిలుపునిచ్చారు. బుధవారం గోశాలల ద్వారా తయారుచేసిన రాఖీలను కాచిగూడలోని గోశాల ఫెడరేషన్ కార్యాలయంలో సంతోషిమాత గోశాల అధ్యక్షుడు బానోతు గణేశ్తో కలిసి అవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఆవుపేడతో వినాయక విగ్రహాలు, దీపాలు తయారు చేయడం జరిగిందని, అదేవిధంగా ఆవుపేడతో రాఖీలను కూడా తయారు చేసినట్లు పేర్కొన్నారు. వీటిలో జామ, బత్తాయి, వేప గింజలు వినియోగించినట్లు చెప్పారు. ఈ రాఖీలను వాడి పడేసిన తర్వాత వర్షంలో నాని రాఖీలో ఉన్న గింజలు మొలకెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా సెల్ ఫోన్ నుంచి వచ్చే రెడియేషన్ను చాలా వరకు ఈ రాఖీలు అదుపుచేస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గోశాల ఫెడరేషన్ బ్రాండ్ అంబాసిడర్ శోభ, స్రవంతి, బానోత్ గణేశ్ లకావత్ తదితరులు పాల్గొన్నారు.