మణికొండ, అక్టోబర్ 26 : మాది అభివృద్ధి మంత్రం.. ప్రతిపక్షాలది మాటల మంత్రమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధితో పాటు భరోసా అని.. అది ఒక్క బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజలు గుర్తించారని తెలిపారు. సులేమాన్నగర్ డివిజన్ నుంచి 200మంది మైనార్టీ నాయకులు, శంషాబాద్ మండలం సుల్తాన్పల్లి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 200మంది నాయకులు, కార్యకర్తలు ఇటీవల పార్టీలో చేరారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రెండు పర్యాయాలు అధికారం చేపట్టి కనీవిని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను అందించడంతో పాటు 60 ఏండ్లలో ఏ కాంగ్రెస్, బీజేపీలు చేయలేని అభివృద్ధి చేసిందని తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రెండు జంట జలాశయాలు ఉన్నా.. తెలంగాణ ఏర్పాటుకు ముందు గుక్కెడు నీటిని తాగేందుకు స్థానిక ప్రజలు నోచుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాగునీటి సమస్య తీరిందని తెలిపారు. అంతేకాకుండా అనేక అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరవేశామని అందుకే వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్కు మద్దతు పలికేందుకు స్వచ్ఛందగా ముందుకు వస్తున్నారని తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి దాదాపు లక్ష మెజార్టీయే లక్ష్యంగా గులాబీ జెండాను మరోసారి ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు.