హిమాయత్నగర్,ఆగస్టు22 : సమాజానికి దివంగత మాజీ కొత్వాల్ రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి అందించిన సేవలు నేటి తరానికి మార్గదర్శమని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. రాజా బహదూర్ వెంకటరామరెడ్డి ఎడ్యూకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో బహదూర్ 152వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం నారాయణగూడ వైఎంసీఎ చౌరస్తాలోని బహదూర్ విగ్రహానికి పలువురు పూల మాలలు వేసి నివాళ్లర్పించారు.
అనంతరం అంజనీకుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో విద్య అవకాశాలు లేని సమయంలో విద్యా సంస్థలు, వసతి గృహాలను స్థాపించి ఎంతో మందికి విద్యను అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి అని కొనియాడారు. నగర కొత్వాల్గా బాధ్యతలు చేపట్టి ఏక దాటిగా 14 సంవత్సరాలు పని చేసి నిజాం ప్రభుత్వమన్నలను పొందారని గుర్తు చేశారు.
భాగ్యనగరం నడిబొడ్డున మహిళల కోసం ప్రత్యేక కళాశాల,హాస్టల్ను ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.
సోసైటీ అధ్యక్షుడు కొండా లక్ష్మి కాంత్రెడ్డి మాట్లాడుతూ అంబర్పేట ముఖద్వారమైన నారాయణగూడ జంక్షన్ను గత యాబై ఏండ్ల నుంచి ఏవరూ అభివృద్ధి చేయలేదని, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రత్యేక చొరవ తీసుకుని సుందరీకరణ చేసి అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు.
రాజా బహదూర్ వెంకట్ రామిరెడ్డి పేరిట విధి నిర్వహణలో ఉత్తమ సేవలందిస్తున్న బేగంబజారు సీఐ మధుమోహన్రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం సీఐ లక్ష్మిమాధవి,సైబారాబాద్ సీసీఎస్ సీఐ యాదయ్యగౌడ్,షాద్నగర్ రూరల్ సీఐ సత్యనారాయణలకు గోల్డ్ మెడల్స్తో సత్కరించి,ఐదువేల నగదు చెక్కును అందజేశారు.
కార్యక్రమంలో సోసైటీ ప్రతి నిధులు డాక్టర్ రఘుపతిరెడ్డి, దామోదర్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, నారాయణగూడ పీఎస్ ఇన్ స్పెక్టర్ భూపతి గట్టుమల్లు, డీఐ రవికుమార్,ఎస్సైలు కరుణాకర్రెడ్డి, సంధ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.