సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ ), కవాడిగూడ : దేశానికే అన్నం పెట్టే రైతన్నకు కృతజ్ఞతగా రైతుబంధు అందజేస్తున్నామని.. పార్టీలు, కులమతాలకతీతంగా 63 లక్షల మంది అన్నదాతలకు ప్రతి సంవత్సరం పెట్టుబడి సాయం అందిస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం ఎన్టీఆర్ స్టేడియంలో పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా రైతుబంధు ఉత్సవాలను నిర్వహించారు. ఈ సంబురాల్లో మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బి.వినోద్కుమార్, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలకు విశ్వవ్యాప్త గుర్తింపు లభించిందన్నారు. తెలంగాణపై విమర్శలు చేసే వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని.. ఆయా రాష్ర్టాల్లో తెలంగాణలోని పథకాలను అమలు చేసి అప్పుడు మాట్లాడితే బాగుంటుందన్నారు. ఒకప్పుడు పన్నులు కట్టిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తిరిగి ఇస్తున్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఏడేండ్లలో రూ. 2 లక్షల 50 వేల కోట్లు ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. మరోవైపు ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్పై రూపొందించిన చిత్రమాలిక ప్రత్యేకార్షణగా నిలువగా.. గంగిరెద్దుల విన్యాసాలు, ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, చెరుకు గడల ప్రదర్శన పండుగ వాతావరణాన్ని తలపించింది.
అందరికీ అన్నం పెట్టే రైతన్నకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహాయమే రైతుబంధు అని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పార్టీలకు, కుల మతాలకు అతీతంగా 63 లక్షల మంది రైతులకు రైతుబంధును ప్రభుత్వం అందిస్తున్నదని, సీజన్ రాగానే రైతుబంధు డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో పడుతున్నాయని తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన గొప్ప పథకం రైతుబంధు కార్యక్రమమన్నారు. సోమవారం నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో వైద్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు పాల్గొన్నారు. కాగా వివిధ రంగులతో రూపొందించిన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రమాలిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన గంగిరెద్దుల ఆటలు, పెద్ద ఎత్తున ముగ్గులు, గొబ్బెమ్మల ఏర్పాటు, చెరుకు గడల ప్రదర్శన సంక్రాంతి పండుగను తలపించింది. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్, టీఆర్ఎస్ నాయకులు ఎంఎన్ శ్రీనివాస్, పవన్కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
పనిలో పోటీ పడండి.. మాటల్లో కాదు
ఐక్యరాజ్యసమితి గుర్తించిన వ్యవసాయ అభివృద్ధి పథకాలలో రైతుబంధు, రైతుబీమాకు స్థానం దక్కిందని, ఈ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి కోసం రెండు పంటలకు సాగునీరు, ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. పండించిన పంటలను కొనుగోలు చేస్తున్నామని, రాష్ట్రం వచ్చాక ఆత్మహత్యలు తగ్గాయని పేర్కొన్నారు. పనిలో పోటీ పడాలి కాని.. మాటల్లో కాదని ప్రతిపక్షాలకు సూచించారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారంతా హుందాగా మాట్లాడాలని తెలిపారు. కొంతమంది ఇతర రాష్ట్రాల నాయకులు తెలంగాణకు వచ్చి విమర్శలు చేస్తున్నారని, ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు మీ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. మీ దగ్గర కూడా రైతులు, కూలీలు, పేదలు ఉన్నారని, వారికి తెలంగాణ రాష్ట్రంలో కంటే ఎకువ సాయం చేసి మాటలు అనాలని హితవు పలికారు.
దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి : మంత్రి హరీశ్ రావు
యావత్తు దేశంలో ఎక్కడలేని విధంగా పంట పంటకు రైతు బంధును అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని వైద్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని పేర్కొన్నారు. రైతులకు ఓనాడు అప్పు పుట్టేదికాదని, పెట్టుబడి కోసం తిరిగే పరిస్థితి ఉండేదని తెలిపారు. కుల మతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు రాష్ట్రంలోని రైతులకు రూ.50 వేల కోట్లు సాయం చేశారని చెప్పారు. దేశంలో ఇలా సాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
రైతులకు వాళ్లు పన్నులు వేశారు.. మేం పన్ను కట్టాం
గత ప్రభుత్వాలు రైతులకు పన్నులు వేశాయని, కాని రైతులకే పన్ను కట్టింది కేసీఆర్ అని చెప్పారు. భూమి శిస్తూ, నీటి తీరువా, కరెంట్ బిల్లు, బ్యాంక్ రుణాలకు వడ్డీ వసూలు చేసే ప్రభుత్వాలుండేవన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్, డీజిల్, ధరలు పెంచి వ్యవసాయాన్ని భారం చేసిందని మండిపడ్డారు. రైతులు ఆదుకొమ్మని వస్తే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులను పిట్టల్లా కాల్చి చంపిన నరహంతకుడిగా నిలిచారని అన్నారు. మధ్యప్రదేశ్లో ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతు బంధు ఉందా..? ఇంటింటికి ట్యాప్ల ద్వారా నీళ్లు ఇచ్చారా.. అని ప్రశ్నించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై ఏడేండ్లలో తెలంగాణ ప్రభుత్వం రూ.2లక్షల 50 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.
దద్దమ్మలు.. దమ్ముంటే పోటీ పడండి.!
పండించిన పంటను కొనమంటే చేతులెత్తేసిన దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని మండిపడ్డారు. గతంలో నెహ్రూ, ఇందిర, వాజ్పాయి, పీవీ ఇతర ప్రధాన మంత్రులు పంటలు కొన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు. రాష్ట్ర పరిధిలో మేం చేయాల్సిందంతా చేశామని చెప్పారు. రోజుకో బీజేపీ ముఖ్యమంత్రి ఇక్కడకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని, దమ్ముంటే తమ రాష్ట్రంతో పోటీపడండని సవాల్ విసిరారు. చేతనైతే ఉచిత కరెంట్, రైతు బంధు సాయం చేయాలని అన్నారు. బీజేపీకి రైతులంటే చిన్నచూపని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయమంటోందని మండిపడ్డారు.
‘రైతు నేస్తం. టీఆర్ఎస్ ప్రభుత్వం..!
బంధువై వచ్చాం.. అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలిచాం. రైతన్నను రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. పార్టీలకు, కుల మతాలకు అతీతంగా 63 లక్షల మంది రైతులకు రైతుబంధును అందిస్తున్నాం. సీజన్ రాగానే రైతుబంధు డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో వేస్తున్నాం. ఎనిమిది విడతల్లో ఇప్పటికే రూ.50వేల కోట్లు అందజేశాం. 40 లక్షల మంది రైతులకు రూ.1600 కోట్లతో జీవిత బీమా కల్పించాం. 70వేల మంది రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5లక్షల చొప్పున రూ.3500 కోట్లు బీమా చెల్లించాం. పండిన పంటను కొనమంటే చేతులెత్తేసిన దద్దమ్మలు, రైతులు ఆదుకొమ్మని వస్తే.. పిట్టల్లా కాల్చి చంపిన నరహంతకులు నేడు రైతులను రాజుగా మార్చాలని చూస్తున్న సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్నారు. మీ రాష్ట్రాల్లో ఇక్కడి పథకాలు అమలు చేసే దమ్ముందా.? ఆ సోయి ఉంటే ఇంతకంటే ఎక్కువ పథకాలు అమలు చేయండి.. ఆ తర్వాత మాటలు మాట్లాడండి.. చేతకాకుంటే చెప్పండి.. శిక్షణ ఇస్తాం. పోయి అమలు చేసుకోండి..’ అంటూ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో మంత్రులు ఈ విధంగా స్పందించారు.
ప్రధాని మాటలు.. ఉత్త మూటలే : హోం మంత్రి
తెలంగాణ రాక ముందు రైతు ఆత్మహత్యలు జరిగాయని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతుల కండ్లల్లో ఆనందం కనబడుతుందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. వ్యవసాయం కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. రైతుల కోసం భారత్లో ఎలాంటి పథకాలు లేవని చెప్పారు. ప్రధాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని, కాని రైతులకు ఏమి చేయలేదని పేర్కొన్నారు. రైతులు కరెంట్ అడిగితే రైతులను గత ప్రభుత్వాలు కాల్చి చంపాయని గుర్తు చేశారు.
లక్షల మందికి సాధారణ బీమా..
పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ప్రమాద బీమా మాత్రమే చేస్తాయని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద మనస్సుతో రైతుల సాధారణ మరణానికి కూడా జీవిత భీమా చేయించారని స్పీకర్ అన్నారు. లక్షల మందికి సాధారణ బీమా చేయిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. రూ.1600 కోట్లను 40లక్షల మంది రైతుల పేరు మీద జీవిత బీమా చేస్తున్నారన్నారు. సాధారణ మరణానికి కూడా రైతు బీమా వర్తించే విధంగా ప్రతి రైతుకు రూ.4 వేల ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఇప్పటి వరకు 70 వేల మంది రైతులకు ఒకొకరికి రూ.5 లక్షల చొప్పున రూ.3500 కోట్లు రైతు బీమా ద్వారా వారి కుటుంబ సభ్యులకు చెల్లించారని స్పీకర్ పోచారం తెలిపారు.