హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లో రాగల రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం రాత్రి హెచ్చరికలు జారీచేసింది. చాలాచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు, కొన్నిచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. అవసరమైతే లోతట్టు ప్రాంతాలవారిని, పురాతన కట్టడాలకు సమీపంలో ఉన్నవారిని తరలించేందుకు 30 పునరావాస కేంద్రాలు, 170 మాన్సూన్ టీమ్లు, 92 స్టాటిస్టిక్స్ బృందాలను సిద్ధంచేశారు.
హైదరాబాద్లోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుండటంతో గేట్లను ఎత్తి, మూసీ నదిలోకి నీటిని వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని బస్తీలు, కాలనీల ప్రజలను అప్రమత్తం చేశారు. గతంలో తెగిన చెరువుల వద్ద పరిస్థితిని ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. బలహీనంగా ఉన్న చెరువుల కట్టలకు మరమ్మత్తు చేస్తున్నారు. కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను గుర్తించి, వారిని అప్రమత్తం చేస్తున్నారు. రిజర్వ్ పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు.