హైదరాబాద్ : ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోమవారం పలు చోట్ల వాన దంచికొట్టింది. గత పదిహేను రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న గ్రేటర్ వాసులు సోమవారం కురిసిన వర్షంతో కొంత ఉపశమనం పొందారు. సోమవారం రాత్రి 8:30 గంటల వరకు గ్రేటర్ పరిధిలోని కూకట్పల్లి బాలానగర్లో అత్యధికంగా 6.15 సెం.మీలు, కేపీహెచ్బీలోని సీబీసీఐడీ కాలనీలో అత్యల్పంగా 1.0 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ఉత్తర-దక్షిణ ద్రోణి రాగల 48గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలుండడంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.