సిటీబ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల ఆదివారం రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. అత్యధికంగా శివరాంపల్లిలో 1.3, చాంద్రాయణగుట్టలో 1.2, మల్కాజిగిరిలోని ఆనంద్బాగ్, రాజేంద్రనగర్, లాలాపేట్, సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతాల్లో 1.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో రాగల మరో రెండు రోజులు నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 29.6, కనిష్ఠం 24.1 డిగ్రీలు, గాలిలో తేమ 83 శాతంగా నమోదైనట్లు వివరించారు.