PM Modi | సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : ఎంఎంటీఎస్.. ఇది సామాన్యుడి రైలు. ఈ నెల 8న సికింద్రాబాద్ స్టేషన్లో 13 కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ సర్వీసులు ఎప్పుడొస్తాయో తెలియదు. నగర ప్రయాణికులకు ఈ సర్వీసులపై అధికారులు ఇప్పటికీ సరైన అవగాహన కల్పించలేదు. ప్రధాని ప్రారంభించిన రైళ్లే పత్తాలేకుండా పోవడంపై నగరవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు జంట నగరాల సౌకర్యార్థం గతంలో 130 ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండేవి. కరోనా తర్వాత వీటి సంఖ్యను రైల్వే అధికారులు 65కు తగ్గించారు. ప్రయాణికుల రద్దీని బట్టి క్రమంగా మరో 20 వరకు పెంచారు. అయినా పాత సర్వీసులను తగ్గించి.. కొత్త సర్వీసులు ప్రారంభిస్తూ ప్రచార ఆర్భాటాలు చేయడంపై ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పదేండ్ల క్రితం ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. నిధులు మంజూరైనా.. పనులు పూర్తికాకపోవడంపై సర్వ త్రా విమర్శలు వస్తున్నాయి.
ఆర్భాటం ఎక్కువ.. అభివృద్ధి తక్కువ అన్న చందంగా ఉన్నది రైల్వే ప్రాజెక్టుల అంశాలు. రాష్ట్రంలోని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండే ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను తగ్గిస్తున్న రైల్వే శాఖ.. తాజాగా 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను ఈ నెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఫలక్నుమా – ఉందానగర్, మేడ్చల్-సికింద్రాబాద్ వంటి స్టేషన్ల మధ్యలో 13 లోకల్ రైలు సర్వీసులు నడుస్తాయని అంటున్నారు. కానీ సరైన సమాచారం ఏదీ లేదు. పైగా ప్రయాణికులు లేరన్న కారణంగా సర్వీసులను కూడా నడుపడంలేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు కొత్తగా ప్రారంభించిన లోకల్ రైలు సర్వీసులు రెగ్యులర్గా నడుస్తున్నాయా? లేదా ? అన్న విషయం కూడా ఎవరికీ తెలిసే అవకాశాలు లేకుండాపోతున్నాయి. ముఖ్యంగా ఎంఎంటీఎస్ సర్వీసులు నడిపే విషయంలో ప్రచారం లోపం తీవ్రంగా ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మేడ్చల్ నుంచి సికింద్రాబాద్తో పాటు లింగంపల్లి వరకు సర్వీసులను నడుపాలన్న డిమాండ్ కూడా ప్రయాణికుల నుంచి ఉన్నట్లు తెలుస్తున్నది.
నగర ప్రయాణికుల సౌకర్యార్థం గతంలో 130 ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండేవి. 2021 నుంచి ఈ సర్వీసులను 65కు తగ్గించారు. క్రమంగా మరో 20 వరకు పెంచినట్లు అధికారులు తెలిపారు. గతంలో దాదాపు 80 వేలకు పైగా నగర ప్రయాణికులు నిత్యం ఎంఎంటీఎస్లో ప్రయాణించేవారు. కానీ రైల్వే శాఖ నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రయాణికుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి రైల్వే శాఖ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి, అన్ని మార్గాలలో సర్వీసులను అభివృద్ధి చేసినట్లయితే రోజు ఒక లక్ష మంది ప్రయాణికులు ప్రయాణం చేయడానికి అవకాశం వచ్చేదన్న అభిప్రాయాలు రైల్వే ఉద్యోగ సంఘాల నాయకులు వ్యక్తపరుస్తున్నారు.
ఎంఎంటీఎస్ రెండో దశ ఏదీ..?
ఎంఎంటీస్ రెండో దశకు సంబంధించిన పనులలో పురోగతి కనిపించడం లేదు. రెండో ప్రాజెక్టు దశలో మొత్తం ఐదు మార్గాలలోఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ నిధులలేవని రైల్వే అధికారులు బుకాయిస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2012-13లో మంజూరైంది. నిధులు కూడా కేటాయించారు.కానీ ప్రస్తుతం దానికి అన్ని నిధులు లేవంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్-బొల్లారం- మేడ్చల్ మధ్యలో 28 కిలో మీటర్లు, ఫలక్నుమా-ఉందానగర్-శంషాబాద్ ఎయిర్పోర్టు మధ్యలో 20 కిలో మీటర్లు, సికింద్రాబాద్-మౌలాలి-ఘట్కేసర్ స్టేషన్ల మధ్యలో 19 కిలోమీటర్లు, మౌలాలి-సనత్నగర్ 21 కిలోమీటర్లు,
కాచిగూడ-సీతాఫల్మండి-మల్కాజిగిరి-మౌలాలి మధ్య 10 కిలో మీటర్ల మేర మొత్తం ఐదు మార్గాలలో ఫేజ్-2 పనులు పూర్తి చేయాల్సి ఉంది. రెండో దశ ప్రాజెక్టులు పనులు మొదలు పెట్టి పదేండ్లు దాటిపోయినా ఇంకా.. ఆ ప్రాజెక్టు పనులు కొనసాగుతూనే ఉన్నాయంటూ రైల్వే అధికారులు చెబుతున్నారు. దీనిపై ప్రధాని, రైల్వే శాఖ మంత్రి, దక్షిణ మధ్య రైల్వే జోనల్ ఉన్నతాధికారులు ఎవరూ సరిగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు బలంగా వినపడుతున్నాయి.