సిటీ బ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): కళాశాలల్లోని విద్యార్థులు ర్యాగింగ్కు దూరంగా ఉండాలని, ఆ విధంగా పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.మురళిమోహన్ అన్నారు. బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ర్యాగింగ్ నిషేధంపై మంగళవారం సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో ర్యాగింగ్ కట్టడి చేసేందుకు విద్యార్థులతో కమిటీలు, నిఘా ఏర్పాటు చేయాలని, అలసత్వం చేసిన కళాశాల యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, పారా లీగల్ వలంటీర్లు సురేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.