CP Tarun Joshi | సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్జోషి హెచ్చరించారు. మహిళల భద్రత కోసం రాచకొండ పరిధిలో షీటీమ్ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని, వేధింపులు ఎదుర్కొనే బాధిత మహిళలు, యువతులు, బాలికలు నిర్భయంగా షీటీమ్కు ఫిర్యాదు చేయవచ్చని సీపీ సూచించారు. వేధింపులకు గురిచేసే ఆకతాయిలకు శనివారం ఎల్బీనగర్లోని రాచకొండ సీపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సెలింగ్లో సీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు తదితర ప్రాంతాల్లో షీటీమ్ బృందాలు మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
డెకాయ్ ఆపరేషన్లో భాగంగా.. మహిళలు, బాలికలను వెంబడించి, వేధించే పోకిరీలను పూర్తి ఆధారాలతో సహా పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపర్చడంతో పాటు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు సీపీ తెలిపారు. ఈ క్రమంలోనే గత నెల 1 నుంచి 15వతేదీ వరకు 120మంది ఆకతాయిలను పట్టుకుని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పించినట్లు తెలిపారు. గత 15 రోజుల్లో 135 ఫిర్యాదులు అందగా, వాటిలో ప్రేమ పేరుతో తోటి ఉద్యోగినిని వేధిస్తున్న వ్యక్తిని, సొంత వదిననే వేధిస్తున్న మరిదిని సైతం అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.