విజయవాడ హైవేపై బరితెగించిన స్నాచర్
బాధితురాలు గాయపడినా.. గొలుసు లాక్కెళ్లిన వైనం
చలాన్ల చెల్లింపు ద్వారా లభించిన క్లూ
విమానంలో వెళ్తుండగా.. నిందితుడి అరెస్టు
24 గంటల్లో కేసు ఛేదించిన రాచకొండ పోలీసులు
సిటీబ్యూరో, మార్చి 30: విజయవాడ హైవే పై ఓ స్నాచర్ బరితెగించాడు. ఓ మహిళ చైన్ లాగే క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడినా.. గొలుసు లాక్కొని పారిపోయాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు వాడిన బండిపై కట్టిన రాయితీ చలాన్లపై ఆరా తీసి.. నేరస్తుడు విమానంలో చెక్కేస్తుండగా, పట్టుకున్నారు. అబ్దుల్లాపూర్మెట్ పీఎస్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి.. హస్తినాపురానికి చెందిన నర్సింహారెడ్డి, భార్య కమలతో కలిసి మంగళవారం సాయంత్రం బైక్పై స్వగ్రామం బీబీనగర్ నుంచి ఇంటికి వస్తుండగా, బాటసింగారం చాచా దాబా వద్దకు రాగానే వెనుక నుంచి పల్సర్ బైక్పై వచ్చిన ఆగంతకుడు.. కమల మంగళసూత్రాన్ని గట్టిగా లాగాడు. ఆమె నడుస్తున్న బండిపై నుంచి కింద పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. అయితే స్నాచర్ కొద్ది దూరం వెళ్లి.. తిరుగొచ్చి.. కమల మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు మంగళసూత్రాన్ని లాగేసుకుని పరారయ్యాడు. వెనకాల వస్తున్న వాహనదారుడు వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసి.. పోలీసులకు సమాచారం ఇచ్చి బాధితురాలిని స్థానిక ప్రైవేటు దవాఖానకు తరలించారు.
రాయితీ చెల్లింపు.. ప్రధాన క్లూ…
నర్సింహారెడ్డి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు వందల సీసీ సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. మహిళ గాయపడినా.. కనికరించకుండా.. స్నాచర్ వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణించారు. అయితే నిందితుడు వాడిన బైక్ నంబర్ దొరికినా..దానికి ఫోన్ లింక్ లేదు. ఈ క్రమంలో ఆ వాహనం నంబర్పై ఉన్న చలాన్లు తనిఖీ చేశారు. 50 జరిమానాలు ఉంటే.. రాయితీ కింద చెల్లించారని…అది కూడా ఒక రోజు ముందే కట్టినట్లు గుర్తించారు. చివరకు పోలీసులకు ఫోన్ నంబర్ దొరికింది. ఆరా తీస్తే.. ఒక రోజు ముందే వాహనాన్ని ఓఎల్ఎక్స్లో అమ్మేసినట్లు యజమాని వివరించాడు. అతడి ద్వారా కీలక ఆధారాలను సేకరించి.. నిందితుడిని ఫాలో అయ్యారు. స్నాచింగ్ చేసిన బైక్ను శంషాబాద్ విమానాశ్రయంలో పార్క్ చేసి…ఢిల్లీకి విమానం ఎక్కుతున్నాడని తేలింది. వెంటనే సైబరాబాద్ పోలీసుల సహాయంతో రాచకొండ పోలీసులు అతడిపై నమోదైన ఎఫ్ఐఆర్, సీసీ కెమెరాల దృశ్యాలను సీఆర్పీఎఫ్ అధికారులకు చూపించడంతో విమానం సీటులో కూర్చోబోతున్న స్నాచర్ హేమంత్కుమార్ గుప్తాను అరెస్టు చేశారు. ఇలా 24 గంటల్లోనే రాచకొండ పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. ప్రాథమిక విచారణలో హేమంత్ యూపీకి చెందిన వాడని గుర్తించారు. విమానంలో వచ్చి..స్నాచింగ్లు చేస్తుంటాడని.. మొత్తం ఆరు ఘటనలకు పాల్పడినట్లు వెల్లడైంది.