అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్ట్
సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): మహిళలను అక్రమ రవాణా చేస్తున్న అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో సీపీ మహేశ్భగవత్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 11న సాయంత్రం ఉప్పల్ పోలీసులకు ఓ యువతి రోడ్డుపై ఏడుస్తున్నట్లు సమాచారం రావడంతో ఆమె చేరదీసిన పోలీసులు విచారణ చేపట్టగా అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది.
ఉత్తర్ఖాండ్కు చెందిన సతీశ్ రజాక్, బంగ్లాదేశ్కు చెందిన బిక్షితిఖాతున్, రాజస్థాన్కు చెందిన దీపక్ చంద్, మహారాష్ట్రకు చెందిన సురేశ్ బలుసునావనే, అస్లం చంద్పటేల్, అరుణ్ రాంచంద్ర జాదవ్లు ముఠాగా ఏర్పడ్డారు. బంగ్లాదేశ్తో పాటు వివిధ రాష్ర్టాల్లో ఉపాధి పేరుతో మహిళలను ఏజెంట్ల సహకారంతో తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన నిందితుడైన సతీశ్ రజాక్, బంగ్లాదేశ్ నుంచి బిక్షితి ద్వారా అమ్మాయిలను రప్పిస్తూ ఇక్కడ నకిలీ పత్రాలతో ఆధార్ కార్డులు కూడా ఇప్పిస్తున్నాడు.
ఓ ఇంటిని అద్దెకు తీసుకొని డేటింగ్ యాప్ల నుంచి విటులను ఆకర్షిస్తూ అమ్మాయిలను సరఫరా చేస్తూ ఆన్లైన్లో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ ముఠాలో రామంతాపూర్లో బియ్యం వ్యాపారం చేసే రాజస్థాన్కు చెందిన కుమావత్ ప్రకాశ్, వెస్ట్బెంగాల్కు చెందిన ప్రియాంక పరారీలో ఉన్నారు. ఉప్పల్లో బాధితురాలు ఇచ్చిన సమాచారంతో నిందితులను మహారాష్ట్ర, రాజస్థాన్కు వెళ్లి పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి బాధితులను రిస్క్యూ చేశారు.