సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): మానవ అక్రమ రవాణాకు పాల్పడుతూ, అమాయకులను వ్యభిచార వృత్తిలోకి దింపుతున్న ముఠాపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ పీడీ యాక్టు ప్రయోగించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బ్రిష్ట ఖాతున కొంతకాలంగా కోల్కత్తలో ఉంటుంది. ఆమెకు ముంబైకి చెందిన సతీశ్ రాజాక్తో పాటు వెస్ట్బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్లోని పలువురితో పరిచయం ఏర్పడింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా యువతులను, మహిళలను ఇక్కడకు రప్పించి.. వారి పేరుతో నకిలీ ఆధార్, ఓటర్ కార్డులు తయారు చేయించి వ్యభిచార గృహాలకు పంపిస్తుంది.
ఎవరైనా చెప్పినట్లు వినకపోతే వారికి నరకం చూపిస్తుంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ నుంచి రప్పించిన అక్కాచెల్లెలిలో ఒకరు మైనర్. అందులో 23 ఏండ్ల యువతికి ఆరు నెలల బాబు కూడా ఉన్నాడు. అనారోగ్యం నేపథ్యంలో ఆ యువతి కొన్నాళ్లు వృత్తికి దూరంగా ఉంటానని చెప్పింది. అయినా కూడా ఆ ఇద్దరిని నిర్వాహకురాలు ముంబై నుంచి హైదరాబాద్కు పంపించి, దీపక్ చందర్, ప్రకాశ్కు అప్పగించింది. వీరు ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్కు వచ్చిన ఆ ఇద్దరు యువతులు వ్యభిచార వృత్తికి నిరాకరించారు. దీంతో వాళ్లలో ఒకరిని ముంబైకి పంపించి, మరొకరిని రోడ్డుపై నిల్చొబెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను కాపాడారు. ముఠా సభ్యులను జూలై 21న అరెస్ట్ చేశారు. అరెస్టయిన ఈ ముఠాలోని దీపక్ చందర్, అస్లం చంద్ పటేల్, అరుణ్ రాంచంద్ర జాదవ్, కుమావత్ ప్రకాశ్పై పీడీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ పెట్టి కేసులో ఒకరికి 225 రోజుల జైలు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 22: ఈ పెట్టి కేసులో ఒకరికి 225 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. కార్ఖానా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్ఖానా ప్రాంతానికి చెందిన విక్రమ్(29) కొద్ది రోజులుగా భార్యను వేధిస్తుండటంతోపాటు చుట్టుపక్కల వారిని దూషి స్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విక్రమ్ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా..గురువారం 13వ ప్రత్యేక ఎంఎం సికింద్రాబాద్ కోర్టు నిందితుడికి జైలుశిక్ష విధించింది.