సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఒడిశా కేంద్రంగా కొబ్బరికాయల మాటున నగరంతో పాటు ఇతర రాష్ర్టాలకు గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.75లక్షల విలువ చేసే 250కిలోల గంజాయి, రవాణాకు వినియోగించిన కంటైనర్ సహా మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాచకొండ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్.చౌహాన్ కేసు పూర్వాపరాలను వెల్లడించారు. తమిళనాడుకు చెందిన మలయ్లి స్వామి అలియాస్ శివ ఉపాధి కోసం తన కుటుంబంతో కలిసి కొంత కాలం కిందట నగరానికి వలస వచ్చి చాంద్రాయణగుట్టలో స్థిరపడ్డాడు. స్నాక్స్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న స్వామి వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో గంజాయి వ్యాపారంతో అధిక డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో నాలుగు నెలల కిందట తమిళనాడు నుంచి రామర్ అనే వ్యక్తిని నగరానికి రప్పించాడు. తన మేనమామ రాజా స్టాలిన్ ద్వారా కేరళా రాష్ర్టానికి చెందిన రాజేశ్తో పరిచయం ఏర్పర్చుకున్న స్వామి తన అనుచరుడైన రామర్తో కలిసి గంజాయి రవాణా చేయడానికి అంగీకరించాడు.
ఒక్కో ట్రిప్పు రవాణాకు రూ.1.5లక్షలు కమీషన్ ఇస్తానని రాజేశ్ హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఒడిషా నుంచి చంద్రశేఖర్ అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేస్తూ నగరంతో పాటు మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, శ్రీలంక తదితర ప్రాంతాలకు మలయ్లి స్వామి, రామార్లు గంజాయి రవాణా చేస్తున్నారు. అయితే ఒడిషాలోని చంద్రశేఖర్ వద్ద ఈనెల 24న 250కిలోల గంజాయి కొనుగోలు చేసి ఎవరికీ అనుమానం రాకుండా కొబ్బరికాయల కింద గంజాయి బస్తాలను దాచిపెట్టి, నగరానికి తీసుకువచ్చారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు మీర్పేట్ పోలీసులతో కలిసి చాంద్రాయణగుట్ట వద్ద నిందితులు ప్రయాణిస్తున్న కంటైనర్ను ఆపి తనిఖీ చేశారు. కంటైనర్లోని కొబ్బరికాయల కింద గంజాయి బస్తాలు బయటపడడంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.75లక్షల విలువచేసే 250కిలోల గంజాయితో పాటు రవాణాకు వినియోగించిన కంటైనర్ వాహనం, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా డ్రగ్స్ విక్రయదారులే కాకుండా వినియోగదారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే ఈ సంవత్సరం 100మందికి పైగా మత్తు పదార్థాలు తీసుకునే వినియోగదారులను అరెస్టు చేశామని, ఒక్క సెప్టెంబర్ నెలలోనే 17మంది వినియోగదారులను అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. రాచకొండ పోలీసు కమిషనర్ చౌహాన్ ఆదేశాల మేరకు, ఎల్బీనగర్-మహేశ్వర్ జోన్ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ పర్యవేక్షణలో మీర్పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.