సిటీబ్యూరో, అగస్టు 5(నమస్తే తెలంగాణ): క్రికెట్ బెట్టింగ్ దందాను నిర్వహిసున్న ఓ వ్యక్తిని గురువారం రాచకొండ పోలీసులు అరెస్టుచేశారు. ఎల్బీనగర్ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం..నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన షేక్ సాధిక్ ఐదేండ్ల కిందట నగరానికి వలస వచ్చాడు. తపోవన్ కాలనీలో నివాసముంటూ ఆన్లైన్, ఆఫ్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. తొలుత ub uae bet, 8 team, mb max inplay bet యాప్లలో మెంబరుగా చేరి.. రూ. 10 వేల నగదును డిపాజిట్ చేసి యూజర్ నేమ్, పాస్వార్డును పొందుతాడు. ఆ తర్వాత అతడికి మరికొందరినీ చేర్చుకునే అవకాశం ఉంటుంది.
ఇలా తనకు తెలిసిన వారిని, మిగతా పందెంరాయుళ్ల నుంచి మెంబర్ షిప్ కింద రూ. 10 వేలు వసూలు చేసి వారికి ఓ లింక్ను పంపిస్తాడు. దాన్ని వారు క్లిక్ చేసి బెట్టింగ్ రుసుమును చెల్లించి పందెం కడతారు. అలా నగదును సేకరించి సాధిక్ వాటిని తాను డౌన్లోడ్ చేసుకున్న బెట్టింగ్ యాప్ల బుకీల ఖాతాలకు బదిలీ చేస్తాడు. పందెం రాయుళ్లతో పాటు సాధిక్ కూడా బెట్టింగ్లు పెడతాడు. రాచకొండ ఎస్వోటీ ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ రవికుమార్ బృందం బుధవారం రాత్రి తపోవన్కాలనీలోని సాధిక్ ఇంటిపై సోదాలు జరిపింది.రూ. 95.33 లక్షలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకుంది.