సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): గణేశ్ నవరాత్రులు, నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రకాల భద్రత, ఏర్పాట్లు చేయాలని సోమవారం అన్ని శాఖలతో కలిసి ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. గణేశ్ నవరాత్రులు, నిమజ్జనంపై సోమవారం నేరేడ్మెట్లోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసు శాఖతోపాటు జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, నీటిపారుదల, వైద్య, విద్యుత్, రవాణా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. నవరాత్రులు, నిమజ్జనం ఏర్పాట్లు, నిర్వహణ, భద్రత లాంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. అందరం కలిసి పనిచేద్దామని, ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిద్దామని సూచించారు. ప్రభుత్వం గుర్తించిన చెరువులు, కుంటలు, చిన్న చెరువులు, సరస్సుల్లోనే నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాహకులు, భక్తులు అక్కడికి వచ్చే విధంగా సూచనలు చేయాలని సీపీ సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా శాఖలు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉంటూ 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. నిమజ్జన రూట్లలో మరమ్మతులు, శానిటైజేషన్తో పాటు నిమజ్జనం నిర్వహించే చోట స్విమ్మర్స్, భారీ క్రేన్లు, లైటింగ్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు రాజేశ్ చంద్ర, అభిషేక్ మహంతి, బాలస్వామి, గిరిధిర్, శ్రీనివాస్, సాయిశ్రీ, మురళీధర్, ఉషా విశ్వనాథ్, శ్రీబాల తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.