సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐపీఎల్-2023 పోటీలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. సోమవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ టీమ్ ప్రతినిధులు, హెచ్సీఏ, బీసీసీఐ ప్రతినిధులతో కలిసి బందోబస్తుకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు సీపీ పలు సూచనలు చేశారు.
ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, టిక్కెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని సన్రైజర్స్ బృందానికి సీపీ సూచించారు. ప్రేక్షకులకు అవసరమైన పార్కింగ్ ఏర్పాట్లు, మంచినీరు, టాయిలెట్స్ సౌకర్యాలు కల్పించాలని, ప్రతి ఒక్కరి కదలికలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని తెలిపారు. టిక్కెట్ల పంపిణీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, పుకార్లను నమ్మవద్దని, నకిలీ టిక్కెట్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాచకొండ కమిషనరేట్లో జరుగుతున్న మ్యాచ్ల నిర్వహణకు అవసరమైన, సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకొని పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సమావేశంలో రాచకొండ జాయింట్ కమిషనర్ సత్యనారాయణ, ట్రాఫిక్ డీసీపీ అభిషేక్ మొహంతి, మల్కాజిగిరి డీసీపీ జానకి, తదితర అధికారులు పాల్గొన్నారు.