సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఏదైనా ఘటన జరుగగానే డయల్ 100కు కాల్ చేస్తే పోలీసులు వెంటనే నేరస్తులను పట్టుకునే అవకాశం ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్.చౌహాన్ తెలిపారు. బుధవారం నేరేడ్మెట్లోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ రెండు గంటల్లో నేరస్తులను పట్టుకున్న ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వనస్థలిపురంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతి మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని ఇద్దరు స్నాచర్లు పరారయ్యారు. ఆ యువతి ఐదు నిమిషాల్లో డయల్ 100కు కాల్ చేసింది. 10 నిమిషాల్లో చుట్టుపక్కల ఉన్న పోలీసులందరూ అప్రమత్తమయ్యారు. ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. రెండు గంటల్లోనే స్నాచర్లను పట్టుకున్నారని సీపీ వివరించారు. స్నాచింగ్లు జరగకుండా పటిష్టంగా పోలీసు పెట్రోలింగ్ ఉన్నదన్నారు. స్నాచింగ్లు జరిగితే 24 గంటల్లోనే ఛేదించాలనే లక్ష్యంతో రాచకొండ పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. ఘటన జరిగిన తర్వాత ఎంత తొందరగా పోలీసులకు సమాచారం ఇస్తున్నారనేది కూడా ప్రధానమని, వెంటనే సమాచారం ఇవ్వడంతో పరిసర ప్రాంతాలన్నీ కట్టడి చేసే అవకాశం ఉంటుందన్నారు.
నడుచుకుంటూ వెళ్తుండగా..
మన్సూరాబాద్కు చెందిన బాధితురాలు డీమార్ట్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. 8వ తేదీన కూరగాయల మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తుండగా యాక్టివా బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు, చేతిలో ఉన్న ఫోన్ను లాక్కొని పరారయ్యారు. షాక్కు గురైన బాధితురాలు వెంటనే తేరుకొని సమీపంలో ఉన్న వారి ఫోన్ తీసుకొని డయల్ 100కు సమాచారం ఇచ్చింది. ఆ తరువాత కుటుంబ సభ్యులకు, స్థానిక పోలీసులకు విషయం తెలిపింది. స్నాచింగ్ ఘటన జరిగిందనే విషయం డయల్ 100 ద్వారా ఎల్బీనగర్ జోన్ పోలీసులకు సమాచారం అందింది. శాంత భద్రతల పోలీసులతో పాటు ఎల్బీనగర్ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం రంగంలోకి దిగింది. నేరగాళ్లు యాక్టివా వాహనంపై వచ్చినట్లు బాధితురాలు చెప్పడంతో.. 10 నిమిషాల వ్యవధిలో నేరగాళ్లు యాక్టివా వాహనంపై ఎంత దూరం వెళ్లి ఉంటారని అంచనా వేసి.. పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఇంత వేగంగా స్పందిస్తారనే విషయాన్ని నేరగాళ్లు ఊహించలేకపోయారు. ఘటన జరిగిన తరువాత పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేయడంతో అనుమానాస్పదంగా ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. జనగాం జిల్లాకు చెందిన శరత్ జాన్సన్ నాగోల్లో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన చిలుమల విజయ్ సాయితో కలిసి యాక్టివాపై వెళ్లి బాధితురాలి మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని పరారయ్యారు. ఇద్దరు నిందితుల నుంచి చోరీ సొత్తుతో పాటు నేరానికి వాడిన ద్విచక్ర వాహనం, నిందితులకు సంబంధించిన మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.