సిటీబ్యూరో/సుల్తాన్బజార్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నగరంలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి, ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ పలు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. రామంతాపూర్ ప్రిన్స్టన్ కాలేజీ, నాచారంలోని జాన్సన్ గ్రామర్ హై స్కూల్, కుషాయిగూడలోని చైతన్య కాలేజీ కేంద్రాల వద్ద బందోబస్తు, పరీక్ష ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. సీపీ వెంట మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకీ, మల్కాజిగిరి ఏసీపీ నరేశ్ రెడ్డి, కుషాయిగూడ ఏసీపీ వెంకట్రెడ్డి తదితర పోలీసులు ఉన్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో..
మేడ్చల్, జూన్11(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఆదివారం ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్1 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో 101 పరీక్షా కేంద్రాల్లో 49,990 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 27,735 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 21,925 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ పర్యవేక్షణలో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్షా కేంద్రాలకు 10:15 నిమిషాల ముందే అనుమతించినట్లు అధికారులు తెలిపారు. గ్రూప్1 పరీక్షా కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి పరిశీలించారు.
అరగంట ఆలస్యంగా..
కోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన గ్రూప్ పరీక్ష కేంద్రానికి 1008 మందిని అలాట్ చేయగా.. ఇందులో 456 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించలేదు. నల్లగొండ జిల్లా సంస్థాన్నారాయణ్పూర్ గుజ్జా గ్రామానికి చెందిన స్వాతి 10.17 నిమిషాలకు పరీక్షా కేంద్రానికి చేరుకుంది. ఆలస్యంగా వచ్చిన కారణంగా పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు.
కవాడిగూడ, జూన్ 11: దోమలగూడ గగన్మహల్లోని ఏవీ కళాశాల కేంద్రంలో 1008 మంది అభ్యర్థులు గ్రూప్-1 పరీక్ష రాయాల్సి ఉండగా.. 462 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 546 మంది గైర్హాజరయ్యారు. వీరిలో నలుగురు అభ్యర్థులు అరగంట ఆలస్యంగా రావడంతో వారిని వెనక్కి పంపించినట్లు దోమలగూడ ఇన్స్పెక్టర్ దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.