R.Krishnaiah | రవీంద్రభారతి, ఫిబ్రవరి14 : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం 61 ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో వీఆర్ఏల జేఏసీ నిర్వహించిన సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. జీవో నెంబర్ 81 ప్రకారం 61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల ఉద్యోగాలను వారి వారసులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
20,555 మంది వీఆర్ఏల వారసుల్లో ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో చెప్పారని ఆయన గుర్తు చేశారు. వీఆర్ఏల వారసులకు 16,758 మందికి ఉద్యోగాలు ఇచ్చారని.. మిగిలిన3,758 మందికి ఉద్యోగాలు రాక వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చాక వీరికి ఉద్యోగాలు కేటాయిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు. వీరికి ఉద్యోగాలు ఇస్తే , రెవెన్యూ శాఖ బలోపేతంతో పాటు, నిరుద్యోగులకు ఉపాధి దక్కుతుందని అన్నారు. వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కేటాయించడంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల17న ఛలో హైదరాబాద్కు వీఆర్ఏలు ఇచ్చిన పిలుపునకు మద్దతు తెలుపుతున్నట్లు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.
నిరుద్యోగుల ఓటు బ్యాంకుతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్రెడ్డి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన సీఎం హామీలు ఇప్పుడు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలను నోటిఫికేషన్ వేసి భర్తీ చేయాలన్నారు. లేకుంటే విద్యార్థులు సీఎం రేవంత్రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిరుద్యోగులను మోసం చేయడానికి పూనుకున్నారని విమర్శించారు. వీరికి తగిన గుణపాటం చెబుతారని అన్నారు.