దుండిగల్: రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాపాలన నడుస్తుందా…? ఫ్యాక్షనిస్టుల పాలన నడుస్తుందా…? తెలియడం లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు. మాజీ మంత్రి హరీశ్రావుపై ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందని, సంవత్సర కాలంలో 420 అబద్ధపు హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారని, కానీ ఏడాది పూర్తయినా.. ఇచ్చిన 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే, రేవంత్రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నదని, ఎలాంటి ఆధారాలు లేకుండా మాజీ మంత్రి హరీశ్రావుపై కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు అవతలి వ్యక్తి ఎవరూ? వారి చరిత్ర ఏమిటీ, విశ్వసనీయత ఏమిటీ అని పోలీసులు సైతం ఆలోచించాలన్నారు. ‘చక్రధర్గౌడ్ అనే ఓ చీటర్ వెళ్లి కేసు పెడితే.. ఆధారాలు లేకున్నా హరీశ్రావు వంటి వ్యక్తిపై కేసు నమోదు చేస్తారా..? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు పెడతారా…? మేము కూడా కేసులు పెడతాం.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? కొడంగల్ నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి తన చావుకు సీఎం రేవంత్రెడ్డి, ఆయన సోదరులే కారణం అని నోట్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ పోలీసులు ఇప్పటి వరకు వారిపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు. లగచర్లలో గిరిజనులను ఇబ్బందులకు గురిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డిపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు. సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులపై బుల్డోజర్లు ఎక్కిస్తాం.. అని అంటున్నా పోలీసులు కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు’…? అని ప్రశ్నించారు.
తప్పుడు కేసులు పెడుతున్నారు…
‘100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే కదా.. రైతు రుణమాఫీ, రైతుబంధు, వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్లు, మహిళలకు రూ. 25వేలు, 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అవన్నీ ఎందుకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్ ప్రశ్నిస్తే.. వాటికి సమాధానం చెప్పలేక, తప్పుడు కేసులు పెడుతున్నారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండానే సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతోనే మాజీ మంత్రి హరీశ్రావుపై కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ను ఎదుర్కోలేక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించలేక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చతికిల పడిపోయారు. బీఆర్ఎస్ నేతల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునే ప్రసక్తేలేదు’ అని ఎమ్మెల్యే వివేకానంద్ హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్కు హరీశ్రావుకు ఎలాంటి సంబంధంలేదని, కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పలేకనే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తక్షణమే మాజీ మంత్రి హరీశ్రావుపై పెట్టిన బూటకపు కేసును ఉపసంహరించుకోవాలన్నారు.