కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 30 : ఎనిమిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చారని, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులను కల్పిస్తూ నాణ్యమైన బోధనను అందిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కూకట్పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే కృష్ణారావు సొంత నిధులతో చేపట్టిన 11వేల మంది పేద విద్యార్థులకు కిట్ల పంపిణీ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్కుమార్, జనార్దన్రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్, రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు హాజరయ్యారు. కూకట్పల్లి డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న రెండువేల మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, డిక్షనరీలతో కూడిన పాఠశాల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ పేద విద్యార్థులకు కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మన ఊరు.. మన బడితో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఒక్కో విద్యార్థికి సగటున రూ. 1.20 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన సాగుతున్నదని తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత గురువులదే కీలకమైన స్థానమని, ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా పనిచేసి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.
ఆ ఇద్దరూ.. పోటీపడుతున్నారు..!
ఈ సందర్భంగా మంత్రి సబిత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్పై ప్రశంసల వర్షం కురిపించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్ పోటీపడి సేవలందించడం గొప్ప విషయమని, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు పేద విద్యార్థులకు చేయూతనందించాలని మంత్రి ఆకాంక్షించారు. కూకట్పల్లి రాజీవ్గాంధీనగర్లో ఎమ్మెల్సీ నవీన్కుమార్ తాతగారైన మాధవరం రాంచందర్రావు పేరున రూ.90 లక్షల (సొంతంగా)తో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించారని, ఎమ్మెల్యే కృష్ణారావు సొంత నిధులతో 11 వేల మంది విద్యార్థులకు స్కూల్బ్యాగులు, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, డిక్షనరీతో కూడిన పాఠశాల కిట్ల పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో పదికి పది జీపీఏ పాయింట్లు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే కృష్ణారావు ట్యాబులను అందిస్తారని… విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉత్తమ ఫలితాలతో ట్యాబులను సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు పాఠశాల కిట్లను అందించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కూకట్పల్లి మెట్రో స్థలాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆట స్థలానికి కేటాయించాలని మంత్రిని కోరారు. అనంతరం విద్యార్థులలో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ వేదికపై విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పార్టీ కో ఆర్డినేటర్ సతీశ్ ఆరోరా, కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, మందడి శ్రీనివాస్రావు, ఆవుల రవీందర్రెడ్డి, పగుడాల శిరీషా బాబురావు, ముద్దం నర్సింహ యాదవ్, పండాల సతీశ్గౌడ్, సబీహాబేగం, మాజీ కార్పొరేటర్లు శ్రావణ్ కుమార్, బాబూరావు, నరేంద్రాచార్య, మండల విద్యాధికారి ఆంజనేయులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.