హిమాయత్నగర్ : బముఖ ప్రజ్ఞాశాలి,బభాషాకోవిదుడు భారత మాజీ ప్రధానమంత్రి పి.వి నరసింహారావు దేశానికి అందించిన సేవలు స్ఫూర్తి దాయక మని పి.వి శతజయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు.
సురభీ ఎడ్యుకేషనల్ సోసైటీ, తెలుగు అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు అకాడమి మాజీ ఉపసంచాలకుడు ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి రచించిన జాతిరత్న పి.వి నరసింహారావు గ్రంథావిష్కరణ సోమవారం సాయంత్రం హిమాయత్ నగర్లోని తెలుగు అకాడమీ ప్రాంగణంలో జరిగింది.
తెలుగు అకాడమి మాజీ డిప్యూటి డైరెక్టర్ డాక్టర్ అవ్వం పాండయ్య అధ్యక్షతన జరిగిన సభకు కేశవరావు హాజరై మాట్లాడుతూ పి.వి శతజయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ పూనుకోవడం చాలా గొప్ప విషయ మన్నారు.
ఆర్థికవేత్త, తత్వవేత్త, సామాజిక, రాజకీయవేత్తైన పి.వి నర్సింహారావు చాలా క్లిష్టమైన కాలమాన పరిస్థితుల్లో దేశానికి ప్రధానమంత్రి అయ్యారని తెలిపారు. తన జీవితాన్ని ప్రజల కోసమే అంకితం చేసిన వ్యక్తి పివి అన్నారు. మైనార్టీ ప్రభుత్వాన్ని చాణక్యునిలాగా నడిపారని గుర్తు చేశారు. వారిపై మరిన్ని రచనలు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఎంఎల్సీ సురభి వాణీదేవి ప్రధాన వక్తగా హాజరై మాట్లాడుతూ దేశంలో ఏ అకాడమి చేయని కృషి తెలుగు అకాడమి చేస్తుందన్నారు. వేల ఏండ్ల చరిత్ర కలిగిన దేశం లో దక్షిణాది నుండి వింధ్య పర్వతాలు దాటి ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి పి.వి నరసింహారావు కొనియాడారు.
పి.విపై ఉన్న మక్కువతో 77 ఏండ్ల వయస్సులో ఉన్న గ్రంథకర్త చెన్నకేశవరెడ్డి ప్రామాణికమైన గ్రంథం రాయడం ఎంతో సంతోషకంగా ఉందన్నారు.పి.వి జీవిత చరిత్రను ఎంతో సమగ్రంగా వివిధ అధ్యాయాల వారిగా రచించడం పట్ల ఆయనను అభినందించారు.