మియాపూర్, జనవరి 7 :శేరిలింగంపల్లి జోనల్ స్థాయి వివిధ విభాగాల సమన్వయ(కన్వర్జెన్సీ) సమావేశం ఈసారి సాధారణానికి భిన్నంగా జరిగింది. ప్రతిసారీ కేవలం కార్యాలయంలోనే జోన్ స్థాయిలో నెలకొంటున్న ట్రాఫిక్, లాఅండ్ఆర్డర్, ఫుట్ పాత్ల ఆక్రమణలు, యూటర్న్ల సమస్యలు, ఫుట్ పాత్ నిర్మాణ ప్రాంతాలు, స్ట్రీట్ ఫర్నిచర్ సహా పలు ఇతర అంశాలపై వివిధ విభాగాల అధికారులతో సమీక్షించి చర్యలపై చర్చించేవారు.
అయితే అందుకు భిన్నంగా క్షేత్రస్థాయిలో నెలకొంటున్న పరిస్థితులు, ప్రజాసమస్యలు, పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై సమస్య వద్దకే వెళ్లి పరిశీలించేలా జోనల్ కమిషనర్ శంకరయ్య ఈసారి ఏర్పాటు చేశారు. గతంలో మంత్రి కేటీఆర్ సూచించిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా శనివారం ఇక్కడి జోనల్ కార్యాలయంలో జడ్సీ అధ్యక్షతన జోనల్ స్థాయి కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించగా.. ట్రాఫిక్, లాఅండ్ఆర్డర్, ఆర్అండ్బీ, విద్యుత్, ట్రాన్స్కో, టీఎస్ఐఐసీ సహా ఆయా విభాగాల హెచ్వోడీలందరిని సమావేశంలో భాగస్వాములను చేశారు.
కార్యాలయంలో కూలంకషంగా సమీక్షించిన అనంతరం ప్రత్యేకంగా ఓ పాఠశాల బస్సులో జడ్సీ నేతృత్వంలో 30 మంది అధికారుల బృందం కొత్తగూడ ఫ్లై ఓవర్, ఖాజాగూడ, రాయదుర్గం, దుర్గంచెరువు, ఏఏంబీ థియేటర్, క్యూఎంబీ, ఏఐజీ దవాఖాన సహా సుమారు 15 ప్రాంతాల్లో పర్యటించింది. స్థానికంగా పరిశీలించిన అంశాలపై ఏ చర్యలను చేపట్టాలో క్షేత్రస్థాయిలోనే చర్చించారు. ఈ సందర్భంగా జడ్సీ శంకరయ్య మాట్లాడుతూ.. పాదచారుల భద్రత కోసం జోన్ వ్యాప్తంగా విస్తృతంగా ఫుట్పాత్ల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు, స్ట్రీట్ ఫర్నిచర్ అభివృద్ధికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు.
ఫుట్ పాత్ల ఆక్రమణల తొలగింపునకు సమన్వయంతో ముందుకు సాగాలని, ట్రాఫిక్కు సమస్యగా ఉన్న ప్రాంతాల్లో రహదారుల వెడల్పు, బా టిల్ నెక్ పరిష్కార చర్యలు, యూటర్న్ల వద్ద వాహనాలు సులువుగా ముందుకు సా గేలా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. తక్షణ పరిష్కారం చూపగలిగిన సమస్యలకు చర్యలతోపాటు నిధులతో ముడిపడి ఉన్న వాటిపై వెంటనే తగు ప్రతిపాదనలను రూపొందించాలని జడ్సీ శంకరయ్య ఆదేశించారు.
ఈ సందర్భంగా మొక్కలకు నీరు పోస్తున్న జీహెచ్ఎంసీ ట్యాంకర్లతోపాటు నిర్మాణ వ్యర్థాలు తరలిస్తున్న వాహనాలకు చలాన్లు వస్తున్నట్లు, వాటి నుంచి మినహాయింపు కావాలని పోలీసులను కోరారు. రహదారుల విస్తరణతో ట్రాఫిక్కు ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాలను పక్కకు తరలించాలని జడ్సీ సూచించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్రావు, ఆయా విభాగాల అధిపతులు, జీహెచ్ఎంసీ, జలమండలి, టౌన్ప్లానింగ్ అధికారులు, డీసీలు, ఇంజినీరింగ్ అధికారులు, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ విభాగాల ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.