సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను వసూలు అధికారులకు సవాల్గా మారుతోంది. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలు, ప్రజాపాలనకు తొమ్మిది రోజులు అధికారయంత్రాంగం ఫోకస్ పెట్టడంతో ఆస్తిపన్ను వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. మరో వైపు వచ్చే నెలాఖరులోగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశాలున్నాయన్న చర్చ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించడం కష్టంగానే మారింది. ఆస్తిపన్ను వసూళ్లలో రోజువారీ లక్ష్యాలను ఖరారు చేసినా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రావడం లేదు.
సర్కిళ్ల వారీగా టాప్-100 బకాయిదారులను గుర్తించి నోటీసులు జారీ చేయాలని, జోనల్ కమిషన్లు ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ అధికారులు నోటీసులు మాత్రమే జారీ చేసి చేతులు దులుపుకున్నారు. క్షేత్రస్థాయిలో చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. ఫలితంగా డిసెంబర్ నెలలో దాదాపు రూ.240కోట్ల లక్ష్యంలో సగం కూడా దాటలేదని తెలుస్తోంది. మొత్తంగా మరో రెండున్నర నెలల్లో దాదాపు రూ.830కోట్ల మేర ఆదాయం రాబట్టడం కష్టసాధ్యమేనన్నది అధికారుల వాదన. ఇదే జరిగితే సంస్థ ఆర్థిక నష్టాల్లో మరింత కూరుకుపోయి ఉద్యోగుల వేతనాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.