బంజారాహిల్స్,ఫిబ్రవరి 9: జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ లోని వ్యాపారి ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్లోని ఇద్దరు సభ్యులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుకోగా.. మరో నిందితుడిని ముంబైలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.. వివరాల్లోకి వెళ్తే..జూబ్లీహిల్స్ రోడ్ నం. 69లోని నందగిరిహిల్స్లో నివాసం ఉంటున్న రవీంద్రకుమార్ శర్మ అనే వ్యాపారి ఇంట్లో గత నెల 18న వం టమనిషిగా చేరిన భూపేందర్ షాహీ తన జన్మదినం అంటూ శుక్రవారం సాయంత్రం తనతో పాటు పనిచేస్తున్న ఇద్దరు సహోద్యోగులను నమ్మించి మత్తుమందు కలిపిన కూల్డ్రింక్ తాగించి నేపాలీ గ్యాంగ్ సాయంతో చోరీకి పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు జూబ్లీహిల్స్ పోలీసులతో పాటు టాస్క్ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలం నుం చి పారిపోయే క్రమంలో భూపేందర్ షాహీకి చెందిన ఓ సెల్ఫోన్ కిందపడిపోవడంతో దానిలో లభ్యమయిన అధారాలతో పాటు నేపాలీ ఏజెంట్ మధన్ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తును కొనసాగించారు. సెల్ఫోన్ సిగ్నళ్లతో పాటు గతంలో భూపేందర్ షాహీ వాడిన సెల్ఫోన్లో కొన్ని కీలక విషయాల ఆధారంగా అతడి కదలికలపై నిఘా పెట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు.. నిందితులు సరిహద్దులు దాటి నేపాల్కు వెళ్లిపోయేందుకు యత్నిస్తున్నట్లు గుర్తించా రు.
నేపాల్కు వెళ్లే మూడు సరిహద్దులకు నగర పోలీసు బృందాలు చేరుకుని మూడురోజుల పాటు కాపు కాశాయి. సరిహద్దు భద్రతాదళం సహకారంతో నిందితులపై నిఘా పెట్టి.. సరిహద్దు చెక్పోస్ట్కు సమీపంలో భూపేందర్ షాహీతో పాటు మరో వ్యక్తిని పట్టుకున్నారు. వీరి నుంచి కొంత సొత్తును స్వాధీనం చేసుకుని నగరానికి తీసు కువస్తున్నట్లు సమాచారం. కాగా చోరీ అనంతరం నలుగురు నిందితులు చోరీ సొత్తును పంచుకున్నారని, వేర్వేరుగా ప్రయా ణిస్తూ సరిహద్దులు దాటాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోం ది. కాగా చోరీలో పాల్గొన్న మరో నిందితుడిని ముంబైలో అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.