Deputations | సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : వైద్య, ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్ల రద్దు ప్రక్రియపై సరైన స్పష్టత లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులను వెనక్కి పంపాలని బుధవారం వచ్చిన ఆదేశాలకు కొనసాగింపుగా అదే రోజు రాత్రి ఆయా జిల్లా అంతర్గత డిప్యూటేషన్లనూ రద్దు చేయాలని ఆరోగ్యశాఖ నుంచి మరో ఆదేశం వచ్చింది. దీంతో డిప్యూటేషన్లపై గురువారం సాయంత్రం వరకు అయోమయ పరిస్థితి ఉంది.
ఇతర జిల్లాల నుంచి డిప్యూటేషన్పై వచ్చిన వారిని వెనక్కి పంపిస్తే ఎలాంటి నష్టం లేకపోయినా…జిల్లాల్లో అంతర్గత డిప్యూటేషన్పై వచ్చిన వారిని వెనక్కి పంపిస్తే ఆరోగ్య కేంద్రాలు మూతపడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మల్కాజిగిరి మేడ్చల్ పరిధిలో 10 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బంది మొత్తం డిప్యూటేషన్పై వచ్చిన వారే. రంగారెడ్డి జిల్లా పరిధిలో 5 పీహెచ్సీలలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ సిబ్బంది దగ్గర నుంచి డాక్టర్ వరకు అందరూ డిప్యూటేషన్పై పని చేస్తున్న వారే. మరో 20 పీహెచ్సీలలో 20 మంది వైద్యులు డిప్యూటేషన్పైననే విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇక హైదరాబాద్ జిల్లా పరిధిలో దాదాపు 15నుంచి 23పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పూర్తిగా డిప్యూటేషన్పై వచ్చిన సిబ్బందితోనే నడుస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా అంతర్గత డిప్యూటేషన్లను రద్దు చేస్తే చాలా చోట్ల ఆరోగ్య కేంద్రాలకు తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్లు అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఎట్టకేలకు డిప్యూటేషన్లపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల అంతర్గత డిప్యూటేషన్ల విషయంలో అనవసరమైన వారిని మినహా అవసరమున్న సిబ్బందిని కొనసాగించవచ్చని అధికారులకు స్పష్టతనిచ్చినట్లు తెలిసింది.