హైదరాబాద్ : హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలో వాటర్ ట్యాంక్లో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని జలమండలి ఎండీ దాన కిశోర్ పేర్కొన్నారు. నగర పరిధిలోని రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకర్ల వద్ద భద్రతకు చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మూడంచెల క్లోరినేషన్తో నాణ్యమైన నీరు అందిస్తున్నామని చెప్పారు. రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకర్ల వద్దకు ఇతరులను అనుమతించమని స్పష్టం చేశారు.
రేపు 100 మంది ప్రయివేటు సెక్యూరిటీ గార్డుల నియామకం చేపడుతామని ప్రకటించారు. మరో 200 మంది జలమండలి సిబ్బందితో భద్రతా పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకుల వద్ద 600 సీసీ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రిజర్వాయర్ల భద్రత తనిఖీకి 4 ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తామని జలమండలి ఎండీ దాన కిశోర్ ప్రకటించారు.